సిద్దిపేట అర్బన్, మార్చి 31 : గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ యువ విద్యార్థుల్లో అంతరిక్ష పరిజ్ఞానం, సాంకేతికపై ఆసక్తిని మరింత పెంచేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కృషి చేస్తోంది. ఇందులో భాగంగా యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలనే లక్ష్యంగా దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. యువికా (యువ విజ్ఞాన కార్యక్రమం) 2022పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. దేశానికి అవసరమైన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నూతన ఆవిష్కరణల వైపు యువతను నడిపించడం, అంతరిక్షంపై మక్కువను పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ శిక్షణకు హాజరుకానున్న విద్యార్థులకు రవాణా చార్జీలు, వసతితో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఇస్రో కల్పిస్తున్నది. అర్హులైన విద్యార్థులు www.isro.gov.in వెబ్సైట్ ద్వారా గత నెల మార్చి 10నుంచి ఏప్రిల్ 10వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఎంపిక జాబితాలను ఏప్రిల్ 20న ప్రకటించి అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు.
ఎంపికైన విద్యార్థులకు శిక్షణ..
ఎంపికైన విద్యార్థులకు వేసవి సెలవుల్లో మే 16నుంచి 28వరకు 13రోజుల పాటు శిక్షణనిస్తారు. విక్రం సారాబాయి స్పేస్ సెంటర్, తిరువనంతపురం, యూఆర్రావు శాటిలైట్ సెంటర్ బెంగళూరు, స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఆహ్మదాబాద్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్, నార్త్ ఈస్ట్ స్పేస్ ఆప్లికేషన్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ నార్త్, ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ షిల్లాంగ్లో శిక్షణ ఉంటుంది. పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది. విద్యార్థితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్ ఉపాధ్యాయుడికి ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పిస్తారు.
అర్హులు వీరే..
మార్చి 1, 2022 నాటికి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు యువికా కార్యక్రమానికి అర్హులు. వీరికి ఎనిమిదో తరగతిలో వచ్చిన మార్కులతో పాటు గత మూడు సంవత్సరాల్లో పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్లో పాల్గొని ఉండాలి. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ సభ్యుడై ఉండాలి. పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థుల ఎంపికలో వెయిటేజ్ ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి రాష్ట్రం నుంచి విద్యార్థుల భాగస్వామ్యం ఎంత నిష్పత్తిలో ఉండాలో నిర్థ్దారిస్తారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 10వరకు దరఖాస్తు చేసుకోవాడానికి అవకాశం ఉంది. ఏప్రిల్ 20న ఇందుకు సంబంధించిన జాబితాను ఇస్రో విడుదల చేయనుంది.
దరఖాస్తు విధానం ఇలా..
విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. విద్యార్థులు ఈ మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకున్న 48గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్విజ్లో పాల్గొనాల్సి ఉంటుంది. క్వీజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్లోని ఆన్లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి. విద్యార్థి సం తకం చేసిన దరఖాస్తుతో పాటు మూ డేండ్లలో వివిధ అంశాల్లో రూపొందించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రా లు ఆప్లోడ్ చేయాలి.
శాస్త్రవేత్తగా ఎదిగేందుకు తోడ్పాటు
విద్యార్థి దశ నుంచే ఎదిగేందుకు యువికా తోడ్పాటు అందిస్తుంది. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు అర్హులైన విద్యార్థులు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలి. విద్యార్థి దశ నుంచే బాల శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు యవికా తోడ్పడుతున్నది.
– రాజిరెడ్డి, మెదక్ జిల్లా సైన్స్ అధికారి