సురక్షిత సిద్దిపేటే లక్ష్యంగా పని చేస్తాం
కమిషనరేట్ను ఉన్నతంగా తీర్చిదిద్దుతాం
నేరాలను ఉక్కుపాదంతో అణచివేస్తాం
ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందిస్తాం
ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు చేరువవుతాం
‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో సిద్దిపేట సీపీ శ్వేత
సిద్దిపేట టౌన్, డిసెంబర్ 28 : రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ప్రత్యేకమైనది.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా.. ఇక్కడ ప్రారంభమైన ఏ కార్యక్రమమైనా రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది.. రాష్ట్రం ఏర్పాటు అనంతరం జిల్లాల పునర్విభజన జరిగింది. అదే సమయంలో సీఎం కేసీఆర్ సిద్దిపేటను పోలీసు కమిషనరేట్గా ఏర్పాటు చేశారు. మొదటి పోలీసు కమిషనర్గా శివకుమార్, అనంతరం జోయల్ డెవిస్ ఇక్కడ పనిచేశారు. సీపీ జోయల్ డెవిస్ బదిలీ అనంతరం కామారెడ్డి ఎస్పీగా పనిచేస్తున్న శ్వేత సిద్దిపేట పోలీసు కమిషనర్గా వచ్చారు. మొదటి మహిళా పోలీసు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆమె కుటుంబ నేపథ్యం, ఉద్యోగ జీవితం, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు.. తదితర అంశాలను సీపీ శ్వేత ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
నమస్తే తెలంగాణ : కుటుంబ నేపథ్యం.. ?
సీపీ శ్వేత : మాది రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి. తండ్రి ఎంపీడీవోగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అమ్మ గృహిణి. స్థానిక శిశుమందిర్లో 10వ తరగతి వరకు తెలుగుమీడియంలో చదివాను. ఉన్నత చదువుల అనంతరం అమెరికాలో సాఫ్ట్వేర్గా పనిచేశా. 2012లో ఐపీఎస్కు ఎంపికయ్యా.
నమస్తే తెలంగాణ : మొదటి పోస్టింగ్.?
సీపీ : శిక్షణ పూర్తైన తర్వాత గ్రేహౌండ్స్లో ఆరు నెలలు పనిచేశా. పశ్చిమ గోదావరి జిల్లా చిత్తర్లో 3 సంవత్సరాలు ఏఎస్పీగా విధులు నిర్వర్తించా. తెలంగాణలో జిల్లాల పునర్విభజనతో కామారెడ్డి ఎస్పీగా మొదటి సారి బాధ్యతలు తీసుకున్నా. ఐదు సంవత్సరాల రెండు నెలలు అక్కడే పనిచేశా.
నమస్తే తెలంగాణ : కామారెడ్డిలో ఎటువంటి సంస్కరణలు చేశారు.?
సీపీ : కామారెడ్డి సూపరింటెండెంట్ పోలీసుగా పనిచేసిన కాలంలో ఫంక్షనల్ వర్టికల్, రిసెప్షనిస్టు అంశాల్లో పూర్తి స్థాయిలో మార్పు తీసుకువచ్చా. స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసిన వెంటనే అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించా. మహిళల రక్షణకు తక్షణ చర్యలు, అత్యవసర, ఆపద సమయాల్లో అండగా ఉండేందుకు ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశా.
నమస్తే తెలంగాణ : సిద్దిపేట మొదటి మహిళా పోలీసు కమిషనర్గా రావడం ఎలా అనిపిస్తున్నది?
సీపీ : సిద్దిపేట పోలీసు కమిషనర్గా రావడం సంతోషంగా ఉంది. కమిషనరేట్ను ఉన్నతంగా తీర్చిదిద్దుతా. సిద్దిపేట అభివృద్ధిలో పూర్తి స్థాయిలో భాగస్వామినవుతా. అందరి సహకారంతో ముందుకు వెళ్తా.
నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో పనిచేయడం సవాళ్లతో కూడుకున్నది.. దీనిని ఎలా అధిగమిస్తారు.?
సీపీ : సిద్దిపేట పోలీసు కమిషనర్గా పనిచేయడం గౌరవంగా భావిస్తున్న. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంచనాలకు తగ్గట్లుగా పనిచేస్తా. కమిషనరేట్కు మరింత ఖ్యాతిని తీసుకువస్తా. ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు మరింత దగ్గరై సేవలందిస్తా.
నమస్తే తెలంగాణ : శాంతిభద్రతల పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు.?
సీపీ : ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తాం. హైదరాబాద్ తరహా సేవలను సిద్దిపేట కమిషనరేట్లోను అందిస్తాం. నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తాం. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. గుట్కా, రేషన్ బియ్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తాం. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా సహించేది లేదు.
నమస్తే తెలంగాణ : కమిషనరేట్లో ఎలాంటి సంస్కరణలు తెస్తారు.?
సీపీ : ప్రజలందరి రక్షణ కోసం వినూత్న సంస్కరణలు అమలు చేస్తాం. ఫిర్యాదు వచ్చిన తక్షణమే స్పందించే పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ప్రజల సంపూర్ణ సహకారంతో సిద్దిపేట పోలీసు కమిషనరేట్ను ఉన్నతంగా తీర్చిదిద్దుతా. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ప్రతి సోమవారం కమిషనరేట్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తాం.
నమస్తే తెలంగాణ : యువతకు మీరిచ్చే సందేశం.?
సీపీ : యువత ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి. చెడు వ్యసనాల బారిన పడకుండా పుస్తకాలతో స్నేహం చేయాలి. చదువు సమాజంలో ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. తల్లిదండ్రుల కలలను సాకారం చేసి భావిభారత పౌరులుగా విద్యార్థులు ఎదుగాలి. యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశం బాగుంటుంది.