వీణవంక రూరల్ : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని, సంక్షేమ సర్కారుకు మద్దతునివ్వాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, రైతు నాయకుడు పొలాడి రామారావు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని ఎలాబాక, గంగారాం, బొంతుపల్లి, ఘన్ముకుల గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా బుధవారం ఆయన ప్రచారం నిర్వహించారు.
ఇక్కడ ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ బీజేపీ సామాన్యుడి నడ్డివిరుస్తోందన్నారు. ప్రజావ్యతిరేక పార్టీ బీజేపీకి ఉప ఎన్నికలో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ఓసీ జేఏసీ నాయకులు పుల్లారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, మాడ మధుసూదన్ రెడ్డి, వీరారెడ్డి, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.