హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): యాసంగిలో ధాన్యం కొనబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించాలని అధికారులను సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు. ఇందులో భాగంగానే ఈ నెల 27, 28, 29వ తేదీల్లో రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆదివారం ప్రత్యామ్నాయ పంటలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని విత్తన కంపెనీలను సీఎస్ ఆదేశించారు. వేరుశనగ, పెసర, శనగ, నువ్వులు, ఆముదం, సజ్జలు, ఇతర నూనె, పప్పు గింజల విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. సోమవారం జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటలపై సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, అధికారులు పాల్గొన్నారు.