ACP Satyanandam : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలోని పటమటలంక ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో భారీ ప్రమాదం సంభవించింది. పోలీస్ ఉన్నతాధికారి, ఏసీపీ సత్యానందం నివాసంలో మొదట ఏసీ కంప్రెషర్, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికంగా కలకలం రేగింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది. అయితే పేలుడు ధాటికి ఎగిరివచ్చిన రాయి తగిలి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. ఏసీపీ సత్యానందం తన కుటుంబంతో కలిసి ఈ నెల 7న విదేశీ పర్యటనకు వెళ్లారు. దాంతో వారి ఫ్లాట్ లాక్చేసి ఉంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఏసీ కంప్రెషర్ నుంచి భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఆ పేలుడు తీవ్రతకు సమీపంలో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా పేలిపోయింది. ఈ పేలుళ్ల ధాటికి అపార్ట్మెంట్లోని కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి శిథిలాల నుంచి ఓ రాయి బయట రోడ్డుపై వెళ్తున్న వ్యక్తికి బలంగా తాకింది. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పెద్ద శబ్దాలు విని భయాందోళనకు గురైన అపార్ట్మెంట్ వాసులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఏసీ కంప్రెషర్లో సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.