కీసర, నవంబర్15 : తెలంగాణలో సుప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసరగుట్ట శివనామస్మరణతో మారుమోగింది. కార్తికమాసం సందర్భంగా రెండో సోమవారం శివభక్తులు అధిక సంఖ్యలో కీసరగుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో స్వామివారికి వేదపండితులు నిర్వహించిన మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు కీసరగుట్ట ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది. కాశీవిశ్వేశ్వరాలయం, లక్ష్మీనర్సింహస్వామి, నాగదేవత ఆలయాలను దర్శించుకున్నారు. అక్కడి నుంచి రాజగోపురం ముందున్న శివలింగాలకు భక్తులు పూజలు, అభిషేకాలు చేశారు. కీసర సీఐ జె.నరేందర్గౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయ చైర్మన్ నాగలింగంశర్మ, కార్యనిర్వహణాధికారి కట్ట్ట సుధాకర్రెడ్డి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శనానికి పంపించారు.