ముంబై : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను తాలిబన్లతో పోల్చడంపై ప్రముఖ రచయిత జావెద్ అఖ్తర్పై శివసేన నిప్పులు చెరిగింది. ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదని, తాలిబన్లను హిందుత్వతో పోల్చడం హిందూ సంస్కృతిని అగౌరవపరచడమేనని పేర్కొంది. ‘హిందూ రాష్ట్ర భావనను ఇష్టపడే వారు తాలిబానీ మనస్తత్వం ఉన్న వారు అని మీరు ఎలా చెప్పగలరు?, దీన్ని మేం అంగీకరించం’ అంటూ మౌత్ పీస్ సామ్నా సంపాదకీయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను తాలిబన్ విధానాలతో పోల్చే ప్రజలు పునరాలోచించుకోవాలని సూచించింది.
మహారాష్ట్ర బీజేపీ సైతం జావేద్ అక్తర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రామ్ కదం మాట్లాడుతూ జావేద్ అక్తర్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పేంత వరకు దేశంలో సినిమాల ప్రదర్శనకు అనుమతి ఉండదన్నారు. ఇదిలా ఉండగా.. జావేద్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ముంబైలోని ఆయన నివాసం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. జుహు ప్రాంతంలోని ఇస్కాన్ దేవాలయం సమీపంలో ఉన్న అక్తర్ నివాసం వెలుపల గట్టి బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జావేద్ అక్తర్ ఇటీవల ఓ న్యూస్ చానల్తో మాట్లాడుతూ ‘తాలిబాన్లు ఇస్లామిక్ దేశాన్ని కోరుకుంటున్నారు. ఈ వ్యక్తులు హిందూ రాష్ట్రాన్ని చేయాలనుకుంటున్నారు’ అని ఆర్ఎస్ఎస్ పేరు పెట్టకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను శివసేన నేత సంజయ్ రౌత్ సైతం తప్పుపట్టారు. దేశంలోని ఏ సంస్థలనైనా తాలిబన్లతో పోల్చడం గర్హనీయమన్నారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, తాలిబన్ల దుర్మార్గ ప్రవర్తన ఇక్కడ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు.