శ్రీశైలం : శ్రీగిరులపై శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ముగిశాయి. నవరాత్రుల పాటు వివిధ అలంకరణలో దర్శనమిచ్చిన భ్రమరాంబ అమ్మవారు ఉత్సవాల్లో చివరి రోజున సిద్ధిదాయినిగా, భ్రమరాంబదేవి నిజరూప అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. దేవస్థానం ఈవో లవన్న ఆధ్వర్యంలో స్వామిఅమ్మవార్లకు షోడశోపచార క్రతువుల్లో భాగంగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, చండీయాగం పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అనంతరం వేదపండితులతో చతుర్వేద పారాయణంతో వేదనీరాజనం చేపట్టారు. సాయంత్రం నందివాహన సేవలో ఆలయ ప్రాకారోత్సవం జరగ్గా.. ఆ తర్వాత శమీపూజ జరిగింది.
పుష్కరిణిలో కనుల పండువలా తెప్పోత్సవం
దసరా మహోత్సవాల్లో భాగంగా ఆఖరిరోజు రాత్రి ప్రాకారోత్సవం అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రధాన గోపురం గుండా పుష్కరిణి వద్ద ప్రత్యేక అలంకరణ చేసిన తెప్పపై ఆసీనులజేసి పుష్పార్చన చేశారు. ఈవో లవన్న ఆధ్వర్యంలో జరిగిన తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు, మ్యూజికల్ ఎఫెక్ట్ ఎల్ఈడీ, సౌండ్సిస్టమ్ ఏర్పాటు చేయగా.. భక్తులను ఆకట్టుకున్నది. పుష్కరిణిలో జరిగిన తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరాగా.. ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి.