న్యూఢిల్లీ: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన హత్యా ఘటనకు సంబంధించి ఢిల్లీలోని జామా మసీదుకు చెందిన షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ఇవాళ ప్రకటన రిలీజ్ చేశారు. తల నరికివేత ఘటనను ఆయన ఖండించారు. అది పిరికిపంద చర్య అని, ఇస్లామ్కు వ్యతిరేకమని ఆయన తన ప్రకటనలో తెలిపారు. గుండె పగిలేలా ఉన్న ఉదయ్పూర్ ఘటన యావత్ మానవాళిని కలిచివేసిందన్నారు. టైలర్ కన్హయ్యలాల్ను ఇద్దరు ముస్లిం వ్యక్తులు కిరాతకంగా చంపడాన్ని షాహీ ఇమామ్ ఖండించారు. ఇది చట్ట వ్యతిరేకం, అమానవీయం అన్నారు. భారతీయ ముస్లింల తరపున ఆ ఘటనను ఖండిస్తున్నట్లు షాహీ ఇమామ్ తెలిపారు.
ఇస్లాం మతం శాంతికి, సౌభాతృత్వానికి చిహ్నమన్నారు. ప్రేమ, సహనం, ఔదార్యం, మానవత్వానికి మహమ్మద్ ప్రవక్త జీవితం నిదర్శనం అన్నారు. ప్రవక్త జీవితాన్ని కానీ, పవిత్ర ఖురాన్ను కానీ, షరియత్ను కానీ ఒకవేళ ఆ ఉన్మాదులు చదివి ఉంటే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండేవారు కాదని షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ తన ప్రకటనలో తెలిపారు.