ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగియగా, మొత్తం ఏడుగురు అభ్యర్థులు బరిలో మిగిలారు. అందులో టీఆర్ఎస్కు చెందిన ఎంసీ కోటిరెడ్డి ఒక్కరే ప్రధాన పార్టీ అభ్యర్థి. మిగతా ఆరుగురూ స్వతంత్రులే కావడం గమనార్హం. వారంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే. అయినా ఆ పార్టీ అధిష్ఠానం నుంచి బీఫామ్ ఇవ్వకపోవడంతో స్వతంత్రులుగానే పోటీ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల్లో బలాబలాలను పరిశీలిస్తే..
టీఆర్ఎస్ విజయం ఏకపక్షమేనన్నది స్పష్టమవుతున్నది. మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆ పార్టీ వారే ఉన్నారు. దాంతో కనీస పోటీ కూడా ఇవ్వలేమన్న యోచనతోనే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా పోటీకి సాహసం చేయలేకపోయిందన్నది బహిరంగ సత్యం. మరోవైపు వచ్చే నెల 10న పోలింగ్, 14న జరుగనున్న కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను ప్రారంభించారు.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్26(నమస్తే తెలంగాణ) : ఇప్పుడు అందరి దృష్టి స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గ పోలింగ్ తేదీ డిసెంబర్10వైపు మళ్లింది. వాస్తవంగా ప్రధాన పార్టీలు బరిలోకి దిగకపోవడం టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ.కోటిరెడ్డి ఒక్కరే ప్రధాన అభ్యర్థిగా ఉండడంతో ఎన్నిక ఏకగ్రీవం కావచ్చని భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేరుగా రంగంలోకి దిగకుండా తమ పార్టీకి చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలతో నామినేషన్లు వేయించి ఏకగ్రీవాన్ని అడ్డుకుంది. అధికారికంగా అభ్యర్థిని పెట్టే విషయంలో కాంగ్రెస్ ముఖ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోగా ఒకవేళ పెట్టినా ఎలాగూ భారీ తేడాతో ఓడిపోతామని భావించి దొడ్డిదారిలో తమ అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దించారు. ఈ పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థులు తాము ఎలాగూ గెలిచే పరిస్థితి కాదు కదా… నామమాత్రం పోటీ ఇవ్వలేనప్పుడు ఎందుకు బరిలో అన్న యోచనతో ఉపసంహరణకు సిద్ధపడినట్లు తెలిసింది. అయితే వీరిలో నల్లగొండకు చెందిన ఒకరిని ఆ పార్టీ కీలక నేత ఒకరు ఉపసంహరణ చేయకుండా అడ్డుకున్నారని సమాచారం. దీంతో ఒకరు పోటీలో ఉన్నాక తాము ఉంటే పోయేదేముందని భావించి మిగతా వాళ్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో మిగిలారు. ఇలా పోటీలో మిగిలిన వారిలో డాక్టర్ కుడుదుల నగేశ్, వంగూరి లక్ష్మయ్య జడ్పీటీసీ సభ్యులు కాగా కాసర్ల వెంకటేశ్వర్లు, బెజ్జం సైదులు, ఏర్పుల శ్రీశైలం కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు. మరో అభ్యర్థి కొర్రా రాంసింగ్ భార్య సైతం కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యురాలే కావడం గమనార్హం. అయితే ఒకే పార్టీకి చెందిన వారంతా బరిలో నిలవడం కూడా చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్లో గందరగోళం
ఈ ఎన్నికలు మరోసారి కాంగ్రెస్ పార్టీలోని గందరగోళ పరిస్థితిని, ముఖ్య నేతల మధ్య విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయన్న చర్చ సాగుతోంది. వీరంతా ఒకే పార్టీకి చెందిన వారైనప్పటికీ అందరి తరపున ఒక్కరిని బరిలో నిలపలేకపోయారన్న విమర్శలు ఆ పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలే తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న వారూ ఈ ఎన్నికల్లో ఏమీ చేయగలరన్న చర్చా సర్వత్రా సాగుతోంది.
టీఆర్ఎస్కే మెజార్టీ బలం
ఈ ఎన్నికల్లో మొత్తం 1271మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మెజార్టీ ఓటర్లు టీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. అక్కడక్కడ గెలిచిన కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరిన వారే ఎక్కువగా ఉన్నారు. ఓ అంచనా ప్రకారం టీఆర్ఎస్కు 1050మందికి పైగా స్పష్టమైన బలం ఉండగా మిగతా పక్షాలన్నీ కలిపి 200వరకు ఓటర్లు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఎన్నికల సమయంలోనే విపక్షాల్లోని గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో వారి ఓటర్లు మరికొంత మంది టీఆర్ఎస్కు మద్దతు తెలిపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పైగా స్వతంత్ర అభ్యర్థుల్లోనూ ఎవరికి ఓటు వేయాలన్న దానిపైనా విపక్షాల్లో గందరగోళం నెలకొననుంది. ఇలాంటి పరిణామాలన్నింటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ.కోటిరెడ్డి విజయం సునాయసమేనన్నది బహిరంగ రహస్యమే. 2018 చివర్లో జరిగిన ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరింతగా బలపడగా 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు సాధించింది. దీంతో ఈ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో ఏకపక్ష విజయం టీఆర్ఎస్ సొంతం చేసుకోనుందనడంలో సందేహం లేదు.
ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి
మరోవైపు జిల్లా అధికారులు ఇక ఎన్నికల పోలింగ్, కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది కేటాయింపు, శిక్షణ, బ్యాలెట్ బాక్స్లను సమకూర్చుకోవడం, బందోబస్తు ఏర్పాట్ల లాంటి వాటిని మరింత వేగవంతం చేయనున్నారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఎన్నికల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.