హైదరాబాద్ : కార్మికులు ఇబ్బంది పడకుండా వారికి సేవలు అందించడంతో పాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం జరిగిన 7వ ఈఎస్ఐసీ రీజినల్ బోర్డు సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి మల్లారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన ఆర్డీ ఏ.కే.వర్మకు మంత్రి శుభాభివందనాలు తెలిపారు. మళ్లీ విజృంభిస్తున్న కొవిడ్ మహమ్మారి వల్ల అడ్మిట్ అయ్యే కార్మికులకు సేవలను అందించేందుకు సనత్నగర్ డీన్ అలాగే నాచారం సూపరింటెండెంట్ను బెడ్స్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
అయితే ఈఎస్ఐసీకి అప్పగించిన సనత్నగర్ ఆస్పత్రిని ఒకలా నాచారం, రామచంద్రాపురం ఆస్పత్రులను మరోలా ఈఎస్ఐసీ వాళ్లు చూడడం చాలా బాధకరమని మంత్రి అన్నారు. నాచారం, రామచంద్రాపురం ఆస్పత్రుల్లో జరుగుతున్న పనులు ఎప్పటిలోగా పూర్తిచేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే ఆస్పత్రుల్లోని కొత్త భవనాల్లో రోగులకు సేవలందించే అన్ని పరికరాల కొనుగోలుకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపాలని సూపరింటెండెంట్లను ఆదేశించారు.
ఈ సమావేశంలోరాణి కుముదిని, ఐఏఎస్, ఆర్డీ ఏకే వర్మ, బోర్డు సభ్యులు మల్లేశం, కే.వి.రమణారెడ్డి, ఏ.రవి శంకర్, వేముల మారయ్య, టి.రాజమహేందర్, సత్యం, ఈఈ రవి కుమార్, ఎస్ఎంవో డా.ప్రదీప్, ఈఎస్ఐసీ డీన్ శ్రీనివాస్, నాచారం మెడికల్ సూపరింటెండెంట్ డా.సత్యనారాయణ, రామచంద్రాపురం డా.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.