థర్డ్ వేవ్ వణికిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్యశాలకు వెళ్లాలంటే.. ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి పెద్ద వైద్యశాలలకు వెళ్లాల్సి వస్తే.. ఎంతో కొంత నిరీక్షణ తప్పదు. పైగా ఆయా దవాఖానలకు వచ్చే రోగులకు ఎవరికి పాజిటివ్ ఉంటుందో.. తెలియదు. ఇలాంటి సమయంలో..టెలీమెడిసిన్ సేవలు అటు దీర్ఘాకాలిక రోగులకు, పేదలకు సంజీవనిగా మారాయి. ఖరీదైన సూపర్ స్పెషాల్టీ వైద్యసేవలను ఉచితంగా ఇంటికి దగ్గర్లోనే అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు పలు బస్తీ దవాఖానల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది అటు రోగులతో పాటు వైద్యులకు కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నది. ఇప్పటికే 80 ‘బస్తీ’ల్లో ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ ఉండగా, మరో 71 వైద్యశాలల్లో అమలుకు సిద్ధమవుతున్నారు.
కరోనా కోరలు చాస్తున్న వేళ.. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా టెలీమేడిసిన్ సేవలు ప్రారంభించింది. నగరంలోని అన్ని టీచింగ్ హాస్పిటల్స్కు చెందిన సూపర్స్పెషాల్టీ వైద్యులు ఆయా దవాఖానల నుంచే బస్తీదవాఖానల్లో ఉన్న రోగులకు టెలీమెడిసిన్ ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు వంటి సమస్యలతో బాధపడుతున్న రోగులు సూపర్ స్పెషాలిటీ సేవల కోసం ఉస్మానియా, నిమ్స్ వంటి ట్రెషరీ దవాఖానలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి పరిసరాల్లోనే ఉండే బస్తీ దవాఖానల నుంచే వైద్య సేవలు పొందే సౌలభ్యం వచ్చేసింది. అంటే దవాఖానకు వెళ్లకుండానే అదే సేవలు ఇక్కడే లభిస్తాయి. ఇంకా చెప్పాలంటే కరోనా బారిన పడకుండా ఈ సేవలతో తమను తాము రక్షించుకోవచ్చు.
80 బస్తీ దవాఖానల్లో సేవలు..
నగరంలో మొత్తం 151 బస్తీ దవాఖానలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 80 బస్తీ దవాఖానల్లో టెలీమెడిసిన్ సేవలు అందిస్తున్నట్లు బస్తీ దవాఖానలు, టెలీమెడిసిన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రుక్మారెడ్డి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికన ప్రజలు బస్తీ దవాఖానల ద్వారా టెలీమెడిసిన్ సేవలు పొందుతున్నట్లు ఆయన వివరించారు. త్వరలోనే మరో 71 బస్తీ దవాఖానల్లో టెలీమెడిసిన్ సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.
టెలీమెడిసిన్ సేవలు ఇలా పొందవచ్చు:
ప్రతి నెలా 5000 మందికి లక్ష్యం
కరోనా సమయంలో బస్తీ దవాఖానల్లో అందిస్తున్న టెలీమెడిసిన్ సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. డిసెంబరులో 2000 మంది టెలీమెడిసిన్ సేవలు పొందారు. అన్ని దవాఖానల్లో సేవలు ప్రారంభమైతే ప్రతి నెల 5000 మంది రోగులకు టెలీమెడిసిన్ సేవలు అందించగలుగుతాం. దీని వల్ల ఉస్మానియా, గాంధీ వంటి హాస్పిటల్స్కు ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం గైనిక్, చర్మవ్యాధులకు సంబంధించి ఎక్కువ మంది టెలీమెడిసిన్ ద్వారా సేవలు పొందుతున్నారు.