హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు వివిధ సేవలను టీటీడీ రద్దు చేసింది. సాలకట్ల వసంతోత్సవాల సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్టు ప్రకటించింది. సాలకట్ల వసంతోత్సవాల్లో తొలిరోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగి వసంతోత్సవంలో పాల్గొంటారని పేర్కొన్నారు. రెండో రోజైన సోమవారం స్వామివారు బంగారురథంపై అధిరోహణ, 23న మలయప్పస్వామి వారితోపాటు సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, భక్తులు 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారని, టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.