డిసెంబర్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా జరిగిన షార్ట్ కవరింగ్తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించినందున గతవారం స్టాక్ సూచీలు కొంతమేరకు కోలుకున్నాయి. వారం మొత్తంమీద 398 పాయింట్లు లాభపడిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 18,105 వద్ద ముగిసింది. కొద్ది ట్రేడింగ్ సెషన్లుగా ఒక నిర్ణీత శ్రేణిలో నిఫ్టీ కదులుతున్న నేపథ్యంలో స్వల్పకాలికంగా ఇదే శ్రేణిలో స్థిరీకరణ జరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొత్త సంవత్సరంలో విదేశీ ఇన్వెస్టర్ల వ్యవహారశైలి, మూడో త్రైమాసిక ఫలితాలు, వచ్చే కేంద్ర బడ్జెట్పై అంచనాలు మార్కెట్ను ప్రభావితం చేస్తాయని వారంటున్నారు. పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్న బ్యాంకింగ్, మెటల్స్ తదితర రంగాలు, థీమ్లపై ఈ వారం ఇన్వెస్టర్లు దృష్టిపెట్టవచ్చని రెలిగేర్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా సూచించారు.
17,800-18,400 మధ్యలో…
2022 సంవత్సరానికి చివరి ట్రేడింగ్ రోజైన డిసెంబర్ 30న 18,250 స్థాయి వద్ద జరిగిన బ్రేక్అవుట్ విఫలం కావడం ప్రతికూల సంకేతంగా, వీక్లీ చార్టుల్లో లాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఏర్పడటం సానుకూల సంకేతమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ నాగరాజ్ షెట్టి చెప్పారు. ఈ కారణంగా పరిమితశ్రేణిలో కన్సాలిడేషన్ జరగవచ్చన్నారు. కొద్దిరోజులపాటు నిఫ్టీ 17,800-18,400 శ్రేణి మధ్యలో హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని షేర్ఖాన్ టెక్నికల్ హెడ్ గౌరవ్ రత్నపార్కి అంచనా వేశారు. ఈ వారం 18,180పైన నిలదొక్కుకుంటే 18,350 పాయింట్ల వరకూ నిఫ్టీ పెరగవచ్చని, ఈ స్థాయిని అధిగమిస్తే 18,440 వరకూ ర్యాలీ జరగవచ్చని మోతీలాల్ ఓస్వాల్ రిసెర్చ్ హెడ్ చందన్ తపారియా అంచనా వేశారు. 18,080 పాయింట్లు, 18,018 పాయింట్ల వద్ద మద్దతుల్ని పొందవచ్చని పేర్కొన్నారు.