కేసీఆర్ హయాంలో బలంగా అమలైన చట్టం.. భూముల రక్షణకు ఉపయోగపడింది. కానీ ఇప్పుడు అదే చట్టం ప్రజలకు శాపంగా మారింది. 22ఏలోకి వచ్చే భూములు ఉంటే వాటిని జాబితాలో ఉంచాల్సింది పోయి మిగిలిన విస్తీర్ణాన్ని కూడా అందులో చేర్చడం అన్యాయం. లక్షల మంది సామాన్యులు అవస్థలు పడుతున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 ( నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలో ప్రజల భూములను ఇష్టానుసారంగా 22ఏలో చేర్చి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని సీనియర్ జర్నలిస్ట్ కే రామచంద్రమూర్తి పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం 22ఏపై ఓ టీవీ చానల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22ఏ ద్వారా భూములను అమ్ముకొని ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హితవు పలికారు. 22ఏపై కలెక్టర్లకు అవగాహన లేదని, దీంతో నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. 2005లో ఈ చట్టం తెరపైకి వచ్చిందని తెలిపారు. కేసీఆర్ హయాంలో కూడా అమలైందని.. కానీ చట్టం బలంగా ఉండేదని పేర్కొన్నారు. ఇప్పుడు అదే చట్టం ప్రజలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.
భూముల కొనుగోలుకు ప్రభుత్వ శాఖలే అనుమతినిచ్చి, రిజిస్ట్రేషన్ చేస్తే ఇందులో ప్రజల తప్పేమున్నదని ప్రశ్నించారు. ఒకవేళ 22ఏలోకి వచ్చే భూములు ఉంటే వాటిని మాత్రమే జాబితాలో ఉంచాల్సింది పోయి మిగిలిన విస్తీర్ణాన్ని కూడా చేర్చడం అన్యాయమని పేర్కొన్నారు. 22ఏ బాధితుల సంఖ్య పెరిగిందని చెప్పారు. తమ భూములు 22ఏ నుంచి తొలగించుకోవాలంటే సామాన్యులు ఆరుగురు ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని వివరించారు. ఏపీలోనూ 22ఏ అమలవుతున్నదని, అయితే అక్కడ సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు. కానీ తెలంగాణలో ఆ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. సర్వేయర్లతో ఫీల్డ్ విజిట్ చేయించి పక్కా ఆధారాలతో తేల్చాలని సూచించారు. ఈ ప్రక్రియలో తహసీల్దార్లకు పూర్తి స్వేచ్ఛనిస్తే కొత్త జాబితాను రూపొందిస్తారని సూచించారు.
సంబంధిత భూములపై వారికి కలెక్టర్ల కంటే ఎక్కువగా అవగాహన ఉంటుందని చెప్పారు. ఇప్పటికే చాలా మంది ప్రజలు తహసీల్ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 22ఏలో అవినీతికి కూడా ఆస్కారం ఉందని చెప్పారు. 22ఏ సమస్య సృష్టించిన ప్రభుత్వమే దానిని పరిష్కరించాలని సూచించారు. రియల్టర్ శ్వేతాకృష్ణమూర్తి మాట్లాడుతూ.. 22ఏ ఇప్పుడే ఎందుకు వెలుగులోకి వచ్చిందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని కోరారు.
ప్రజలను ఇబ్బందులు పెట్టడానికి తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. 22ఏలో అనేక రకాలు భూములున్నాయని చెప్పారు. వాటన్నింటికీ ప్రభుత్వ శాఖలు అనుమతినిచ్చి ఇప్పుడు వాటిని నిషేధిత జాబితాలో పెట్టడం ఏందని నిలదీశారు. అనంతరం ఎడిటర్ అరుణ మాట్లాడుతూ 22ఏలో చేర్చిన లక్షలఎకరాల భూమిపై ఎంతమంది ఆధారపడి ఉన్నారో అర్థం చేసుకోవాలని సూచించారు. ఏండ్లనుంచి కాపాడుకున్న భూములను ఇప్పుడు లాక్కోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తంచేశారు.కార్యక్రమంలో రియల్టర్లుసతీశ్, అశోక్, వెంకటేశ్వర్లు, రవిచంద్రన్ రెడ్డి, రవి ప్రకాశం పాల్గొన్నారు.