భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని ఎస్బీఐ ఎదుట పెద్దగొల్లగూడేనికి చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు మంగళవారం ధర్నా చేశారు. గ్రామానికి చెందిన సుమారు 30 గ్రూపుల పెండింగ్ రుణాలను వన్టైం సెటిల్మెంట్ ద్వారా చెల్లించాలని 2018లో అప్పటి బ్యాంకు అధికారులు సూచించారు. తీసుకున్న రుణాల్లో 50 శాతం మేర చెల్లించారు. బ్యాంకు అధికారులు ఖాతాను క్లోజ్ చేయకుండా బాకీల్లో మాత్రమే ఆ డబ్బును జమ చేసుకున్నారు. నాడు మిగిలిపోయిన బాకీ వడ్డీతో నేడు రూ.1.5 కోట్లకు చేరింది. మళ్లీ రూ.50 లక్షలను వన్టైం సెటిల్మెంట్ కింద కట్టాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడాన్ని నిరసిస్తూ మహిళలు బ్యాంకు ఎదుట ధర్నాకు దిగారు.