హైదరాబాద్, మార్చి 19: గంజాయి స్మగ్లింగ్ రాకెట్ను సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. దాదాపు రూ.1.3 కోట్ల విలువైన 560 కిలోల గంజాయిని పట్టుకొన్నారు. కేసు వివరాలను శనివారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు, శంషాబాద్ స్పెషల్ టీమ్ సిబ్బంది రంగంలోకి దిగారు. తనిఖీల్లో భాగంగా ఓ వ్యాన్లో 280 బ్యాగుల్లో గంజాయి పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, ట్రక్కు, కారు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు. డ్రగ్స్ ముఠా గంజాయిని కిలోకు రూ.1,250కి చొప్పున కొని రూ.20వేలకు అమ్ముతున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని సీపీ వెల్లడించారు.