సికింద్రాబాద్, డిసెంబర్ 17: సీడీపీ నిధుల్లో 90 శాతం మేర నిధులను కంటోన్మెంట్ బోర్డు పరిధిలోనే ఖర్చు చేస్తున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న వ్యాఖ్యానించారు. కేవలం 10 శాతం నిధులను మాత్రమే జీహెచ్ఎంసీ పరిధిలో కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే టీపీటీ బకాయిలు కేవలం 4 శాతమే కాగా, సర్వీస్ చార్జీల రూపేణా కేంద్రం నుంచి రావాల్సిన 96 శాతం బకాయిలను రప్పించే దమ్ము బోర్డు అధికారులకు, కాషాయం నేతలకు ఉందా అని సవాల్ విసిరారు. ఈ క్రమంలో శుక్రవారం వెరీడ్ బోర్డులో మొదటిసారిగా జరిగిన సాధారణ సమావేశంలో బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర, బోర్డు సీఈఓ అజిత్రెడ్డి, నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణతో పాటు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎమ్మెల్యే సాయన్న పాల్గొన్నారు.
తొలుతగా బోర్డుకు సంబంధించిన పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. చిల్లర రాజకీయాలు మాని బోర్డు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తేనే స్థానికులకు ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కేంద్ర ప్రభుత్వం బోర్డుకు సహకరించకపోయినా రాష్ట్రం ఎంతో ముందుచూపుతో సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా ఉంటుందన్నారు. నెల రోజుల్లోనే కంటోన్మెంట్కు ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే పలు దఫాలుగా అధికారులతో సమావేశాలు జరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సరిగ్గా 30 రోజుల్లోగా బోర్డు పరిధిలో ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఎఫ్ఎస్ఐ పరిగణనలో ఏండ్లతరబడి పొరపాటుగా వ్యవహరిస్తూ వచ్చిన విషయం తెలిసిందే..! అయితే ఇటీవల కాలంలో స్థానిక నిర్మాణదారులు ఇరువురు హైకోర్టును ఆశ్రయించడంతో తప్పు తెలుసుకుని, ఎఫ్ఎస్ఐ లెక్కల్లో మార్పులు చేస్తుననట్లుగా తీర్మానం చేయడం జరిగింది. ఈ మేరకు గతంలో ఉన్న ఉత్తర్వులను తామే తప్పుగా పరిగణిస్తూ వచ్చామంటూ పొరపాటును ఒప్పుకోవడం గమనార్హం. ఎఫ్ఎస్ఐ నిబంధనలు అతిక్రమించారంటూ గత 18 ఏండ్లుగా వందలాది నిర్మాణాలను కూల్చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ తప్పును సరిదిద్దుతూ తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారు.
ఇకపై పార్కింగ్, సెల్లార్, స్టిల్ట్, బేస్మెంట్, స్టెయిర్ కేస్, కారిడార్స్, డక్ట్స్, బాల్కనీ, లిఫ్ట్ రూమ్, ఓవర్ హెడ్ ట్యాంకు, జనరేటర్ రూమ్, వాచ్మెన్ రూమ్ తదితర నాన్లివింగ్ ఏరియాలను ఎఫ్ఎస్ఐ నుంచి మినహాయించడంతో పాటు నూతనంగా నిర్మించే భవనాలకు ఈ నిబంధనలను అమలు చేస్తామని ప్రకటించారు. ఎఫ్ఎస్ఐ నిబంధనలు అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలకు సైతం తాజా నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించే అవకాశం ఉందన్నారు. దీంతో వసూలు చేసే కాంపౌండింగ్ జరిమానాల ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు దాదాపుగా రూ.500 కోట్ల మేర ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్లో భవన నిర్మాణాలకు సంబంధించి కఠిన నిబంధనల్లో సడలింపులకు అవకాశం లబించింది. ఎఫ్ఎస్ఐ పరిగణనలో సమీప మున్సిపాలిటీలో పాటించే నియమ, నిబంధనలను ఇక్కడ వర్తింప చేసుకునే వెసులుబాటుకు మోక్షంకలిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో పార్కింగ్ ఫ్లోర్లను మినహాయిస్తూ ఉండటంతో ఇదే నిబంధనను కంటోన్మెంట్లో అవకాశం ఉంది. పుణే, ఢిల్లీల కంటోన్మెంట్లలోనూ పార్కింగ్ ప్రాంతాలను ఎఫ్ఎస్ఐ నుంచి మినహాయిస్తున్నారు. ఎఫ్ఎస్ఐ మినహాయింపులకు సంబంధించి స్పష్టత ఇవ్వాలంటూ 2013, డిసెంబర్ 05 సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తీర్మానం చేసి ఉన్నతాధికారుల ఆమోదానికి పంపింది. ఈ క్రమంలో 2013 నాటి బోర్డు తీర్మానంపై స్పష్టత కోరుతూ గుమ్మడి జానకి రెడ్డి, కీర్తిరెడ్డి అనే వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర ఈ నెల 15న సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్కు లేఖ రాశారు. సదరన్ కమాండ్ పరిధిలోనే ఉన్న పుణేలో అమలవుతున్న విధానాన్నే ఇక్కడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని శుక్రవారం నాటి బోర్డు ఎజెండాలో చేర్చి ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై కంటోన్మెంట్ బోర్డులో నూతనంగా చేపట్టబోయే నిర్మాణాలకు భారీ వెసులుబాటు కలగనుంది. గ్రౌండ్ ఫ్లోర్ను పార్కింగ్ కోసం వదిలే వారికి అదనపు అంతస్తు నిర్మించుకునే అవకాశం కలగనుంది. కంటోన్మెంట్ వ్యాప్తంగా ఇప్పటికే నిర్మితమైన 50వేలకు పైగా నిర్మాణాలకు ఈ నిబంధన వర్తించనుంది.
ఈ మద్యకాలంలో మృత్యుఘోషకు నిలయంగా మారిన బోయిన్ పల్లి మార్గంపై త్వరలో ప్రమాద సూచికలతో పాటు స్పీడ్ కంట్రోల్ చేసేందుకు సూచికలను ఏర్పాటు చేసే దిశగా ముందుకుసాగాలని నిర్ణయించారు. ఆదే విధంగా ఉద్యోగుల పదోన్నతులపై చర్చించగా, ఈ నెలలో సీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న రాములు పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో ఆ స్థానంలో సీనియర్ ఇంజినీర్ గోపాలకృష్ణదాస్కు పదోన్నతిని కల్పిస్తూ బోర్డు తీర్మానం చేయడం జరిగింది. దీంతో పాటు పంప్ హౌజ్లలో ఇక సోలార్ సిస్టమ్ ఏర్పాటుచేసే విధంగా చర్యలు తీసుకోనే అంశంపై ఆమోదం తెలిపారు.
కంటోన్మెంట్ పరిధిలో రాత్రి సమయల్లో ప్రజలతో పాటు అధికారులకు నిద్ర లేకుండా చేస్తున్న ఫంక్షన్ హాల్స్లో సౌండ్ సిస్టమ్ల విషయంలో మాత్రం అధికారులు గట్టిగా చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యారు. రాష్ట్ర సర్కారు నిర్ణయించిన డిసెబెల్స్ ఆధారంగా హద్దు మీరితే మొదటిసారి అయితే రూ. 10వేలు, రెండవసారికి రూ. 25వేలు జరిమానా విధించడతో పాటు మూడోసారి సైతం నిబంధనలు ఉల్లంఘిస్తే ఏడు రోజుల పాటు ఫంక్షన్ హాల్స్ను సీజ్ చేసే విధంగా తీర్మానం చేశారు.