హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): పంచాయతీ పోరులో (Panchayathi Elections) కమలం (BJP) వాడిపోయింది. తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, మరో 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీకి పల్లెల్లో పట్టులేదని తేలిపోయింది. గ్రామ పంచాయతీలకు జరిగిన రెండు విడతల ఎన్నికల్లో స్వతం త్ర అభ్యర్థులు గెలిచిన సీట్లలో కనీసం సగం కూడా సాధించలేక ఘోరపరాభవాన్ని మూటగట్టుకున్నది. తొలి విడతలో దారుణంగా ఓటమిపాలై కేవలం 189 పంచాయతీల్లో గెలుపొందిన బీజేపీకి రెండో విడతలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండో విడతలో ఎన్నికలు జరిగిన 3,911 స్థానాల్లో కేవలం 236 స్థానాల్లో (6.5 శాతం) మాత్రమే బీజేపీ మద్దతుదారులు విజయం సాధించగలిగారు.
ఆదిలాబాద్, మంచిర్యాల మినహా మిగిలిన ఏ జిల్లాలోనూ బీజేపీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. రెండు విడతల్లో ఆ పార్టీ కేవలం 435 స్థానాలతో సరిపెట్టుకున్నది. రెండు విడతల్లో స్వతంత్ర అభ్యర్థులు 1,161 స్థానాల్లో గెలుపొందారు. అందు లో సగం కూడా బీజేపీకి రాకపోవడం కమలనాథుల దయనీయస్థితికి అద్దంపడుతున్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నియోజకవర్గమైన కరీంనగర్తోపాటు ఎంపీ ఈటల గతంలో ప్రాతినిథ్యం వహించిన హుజూరాబాద్లోనూ బీజేపీ మద్దతుదారులు ఓటమిపాలవడం చర్చనీయాంశమైంది. మరో ఎంపీ రఘునందన్రావు ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్లో కనీసపోటీ ఇవ్వకపోవడంతో బీజేపీ ఉనికి ప్రశ్నార్థకమైంది.
మాటల్లోనే ‘ప్రత్యామ్నాయం’
బీఆర్ఎస్ పని అయిపోయిందని, ప్రత్యామ్నాయం తామేనని ఊదరగొట్టే బీజేపీ రాష్ట్ర నేతల మాటలు వట్టివేనని రెండు విడతల పం చాయతీ ఎన్నికల ఫలితాలతో రూఢీ అయిం ది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 30 శాతానికిపైగా ఓట్లు సాధించడం, 8 సీట్లలో గెలుపొందడం గాలివాటమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మున్ముందు తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం నామమాత్రమేని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు బలమైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని, ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపే నిలుస్తున్నారని, అందుకు స్థానిక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు.