అదానీ సంక్షోభం నేపథ్యంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: అదానీ గ్రూప్ షేర్లకు భీకర నష్టాల నేపథ్యంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ స్పందించింది. స్టాక్ మార్కెట్ల సమగ్రతను కాపాడటానికి, వ్యక్తిగత షేర్లలో మితిమీరి చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులను అరికట్టడానికి అవసరమైన అన్ని నిఘా చర్యలను చేపడుతున్నామని, అందుకు కట్టుబడి ఉన్నామని శనివారం స్పష్టం చేసింది. ప్రత్యేకంగా అదానీ గ్రూప్ను, దాని సంస్థలను ప్రస్తావించకుండానే.. గత వారం రోజులుగా ఓ వ్యాపార సంస్థ స్టాక్స్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని సెబీ ఓ తాజా ప్రకటనలో చెప్పింది. అయినప్పటికీ అదానీ వ్యవహారం నేపథ్యంలోనే సెబీ ఈ తరహా ప్రకటనను ఇచ్చిందని అధికారులు చెప్తున్నారు.
ఏఎస్ఎం ఫ్రేమ్ వర్క్లోకి..
అదానీ సంక్షోభం నేపథ్యంలో గ్రూప్లోని మూడు సంస్థలను ఏఎస్ఎం ఫ్రేమ్ వర్క్లోకి తెచ్చారు. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అంబుజా సిమెంట్స్ కంపెనీలను స్వల్పకాలిక అదనపు నిఘా చర్యల (ఏఎస్ఎం) పరిధిలోకి బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్లు తెచ్చాయి. దీంతో ఈ కంపెనీల స్టాక్స్ ధరల్లో ఏదైనా ఒడిదుడుకులు తలెత్తితే దానంతటదే ఏఎస్ఎం వ్యవస్థ పనిచేస్తుంది. ఊహాగానాలను, షార్ట్ సెల్లింగ్ను నిరోధిస్తుంది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్.. అదానీ గ్రూప్లో అవకతవకలున్నాయంటూ ఓ నివేదికను గత వారం విడుదల చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలడం మొదలైన సంగతీ విదితమే. ఈ క్రమంలోనే కేవలం 7 రోజుల్లో రూ.10 లక్షల కోట్లపైనే ఈ సంస్థలన్నింటి మార్కెట్ విలువ కరిగిపోయింది. చివరకు పూర్తిగా సబ్స్కైబ్ అయినప్పటికీ అదానీ ఎంటర్ప్రైజెస్ తమ రూ.20,000 కోట్ల ఫాలో-ఆన్ ఆఫర్ (ఎఫ్పీవో)ను కూడా ఉపసంహరించుకున్నది.
చర్యలకు వెనుకాడం
భారతీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన ఏ సంస్థకు సంబంధించైనా తప్పు జరిగినట్టు సమాచారం అందితే చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని ఈ సందర్భంగా సెబీ స్పష్టం చేసింది. మదుపరుల ప్రయోజనాలకు ప్రమాదం వాటిల్లనివ్వబోమన్నది. కాగా, ఈ సెగ ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకూ తగలగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్సహా దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ సభలో చర్చకు పట్టుబడుతున్నదీ చూస్తూనే ఉన్నాం.