న్యూఢిల్లీ, డిసెంబర్ 20: కార్డియాక్ స్టంట్ తయారీలో దేశంలోనే అతిపెద్ద సంస్థ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఎస్ఎమ్టీ) ఐపీవోకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సోమవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ.1,500 కోట్ల నిధులను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో రూ. 410. 33 కోట్లు ఫ్రెష్ ఇష్యూగా, రూ. 1,089.67 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ (వోఎఫ్ఎస్)గా ఉన్నా యి. కాగా, రూ.185 కోట్ల వరకు పొందేందుకు ఈక్విటీ షేర్ల ప్రీ-ఐపీవో ప్లేస్మెంట్ యోచనలో సంస్థ ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇదే జరిగితే ఫ్రెష్ ఇష్యూ పరిమాణం తగ్గిపోనున్నది. ఐపీవో నిధులను రుణాల చెల్లింపునకు, విదేశీ పరోక్ష అనుబంధ సంస్థ వాస్కులర్ ఇన్నోవేషన్స్ కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నారు. ఈ ఏడాది జూన్ నాటికి సంస్థ రుణ భారం రూ.361.35 కోట్లుగా ఉన్నది. ఇక ఎస్ఎమ్టీలో అత్యధికంగా సమర క్యాపిటల్ మార్కెట్స్ హోల్డింగ్ లిమిటెడ్కు 36.59 శాతం వాటా ఉండగా, శ్రీ హరి ట్రస్ట్కు 35.37 శాతం, ఎన్హెచ్పీఈఏ స్పార్కిల్ హోల్డింగ్స్ బీవీకి 18.44 శాతం వాటాలున్నాయి. ఈ క్రమంలోనే వోఎఫ్ఎస్లో సమర క్యాపిటల్ గరిష్ఠంగా 635.56 కోట్ల విలువైన షేర్లను అమ్మకానికి పెడుతున్నది. ఎన్హెచ్పీఈఏ సైతం రూ.320.36 కోట్ల షేర్లను విక్రయిస్తున్నది.
రాష్ట్రంలో ప్లాంట్
సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్.. రాష్ట్రంలో ఓ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నది. సుల్తాన్పూర్లోని దేశంలోనే అతిపెద్దదైన మెడికల్ డివైజెస్ పార్క్ వద్ద 20 ఎకరాల్లో రూ.250 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ను తీసుకొస్తున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో ఈ నూతన ఆర్అండ్డీ, తయారీ క్యాంపస్ సిద్ధం కానున్నాయి. ఏటా 12 లక్షల స్టంట్లు, 20 లక్షల క్యాథటర్లు తయారుచేసే సామర్థ్యంతో వీటిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సంస్థకు సూరత్, బెంగళూరుతోపాటు థాయ్లాండ్లో ఉత్పాదక కేంద్రాలున్నాయి. 69 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ.. గత ఆర్థిక సంవత్సరం రూ.588.52 కోట్ల ఆదాయాన్ని అందుకున్నది.