న్యూఢిల్లీ, అక్టోబర్ 24: వివాహాలు, పుట్టిన రోజుల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఖరీదైన బహుమతులకు బదులుగా మొక్కలను బహుమతిగా ఇచ్చేలా దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ) ప్రారంభించిన ‘గిఫ్ట్ ఏ స్కీమ్’ పథకానికి విశేష స్పందన లభిస్తున్నది. కేవలం మూడు రోజుల్లోనే 60 మంది ఈ స్కీమ్లో రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. ఈ స్కీమ్లో భాగంగా ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకొంటే.. ఏ మొక్కను ఇవ్వాలి, ఏ పార్కులో నాటాలి.. అనేది ఆన్లైన్ ద్వారా ఎంపిక చేసుకోవాలి. దీనికి రూ.2వేల నుంచి రూ.2,500 వరకు చెల్లించాలి. ఎవరికి ఇస్తున్నామో వివరాలు తెలుపాలి. తర్వాత గిఫ్ట్కు సంబంధించి ఈ-సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. దీన్ని గిఫ్ట్గా ఇవ్వవచ్చు. తరువాత, ఆ మొక్కను ఎంచుకున్న పార్కులో ఎస్డీఎంసీ నాటుతుంది. దాని సంరక్షణ బాధ్యతను చూస్తుంది. మొక్కకు ఏర్పాటు చేసే ట్రీ గార్డుపై ‘బహుమతి గ్రహీత’ల పేరు, వివరాలను రాసి పెడుతుంది. చెట్టు బతికినన్ని రోజులు వారి పేరు అక్కడ నిలిచి ఉంటుంది.