జహీరాబాద్/మొగుడంపల్లి , ఫిబ్రవరి 2: దళిత పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రవేశపెట్టి, లబ్ధిదారులకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. బుధవారం మొగుడంపల్లి మండలంలోని గోటిగార్పల్లి గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులకు పథకంపై ఆవగాహన సదస్సు ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. దళితులు ఆర్థికంగా, సామాజికంగా ముందుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారాన్నరు. ఈ పథకం కింద వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పి, పాడి గేదెల పెంపకం చేయాలన్నారు. వాహనాలు కొనుగోలు చేస్తే నష్టం తప్ప లాభం ఉండదన్నారు. మీ ప్రాంతంలో ఉన్న వనరులను వినియోగించుకొని, వ్యాపారం చేసేలా ప్రణాళికలు చేసుకోవాలన్నారు. ఎస్సీలకు భూములు ఉండవు.. ఎక్కువగా కూలీ పనులు చేసుకుని జీవనోపాధి పొందుతారు. ఇలా పేదరికంతో ఇబ్బందులు పడుతున్న వారిని సమాజంలో తలెత్తుకుని తిరిగేలా చేసేందుకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్నారని, లబ్ధిదారులు పథకాన్ని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. నియోజకవర్గంలో 145 గ్రామాలు ఉంటే దళిత బంధు పథకాన్ని అమలు చేసేందుకు మొదటగా గోటిగార్పల్లి గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు. తన సొంత గ్రామంలో ఈ పథకం అమలు చేయకుండా మీపై ఉన్న నమ్మకంతో ఈ గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు. పశువులు, గొర్రెలు, మేకలు, చేపల పెంపకంపై దృష్టి సారించాలని, వ్యవసాయ అనుబంధంగా యూనిట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. చేపలు పెంచితే ఏడాదిలో మూడు సార్లు విక్రయించే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ భూములు ఉన్న వారు కూరగాయలు పండించే ఆసక్తి ఉంటే ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పిస్తారన్నారు.
విజయవంతం చేయాలి సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజార్షి షా
దళిత బంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేసి జహీరాబాద్ నియోజకవర్గంలో గోటిగార్పల్లిని ఆదర్శ గ్రామంగా నిలబెట్టాలని సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజార్షి షా లబ్ధిదారులకు సూచించారు. భవిష్యత్తులో పాడికి మంచి డిమాండ్ ఉంటుందని, ఎక్కవ శాతం పాడి పశువులు కొనుగోలు చేసుకోవాలన్నారు. వాహనాలు కొనుగోలు చేయొద్దని, వాటి వల్ల నష్టం తప్పు లాభం లేదన్నారు. ఈ పథకం కింద బర్రెలు కొనుక్కుంటే విజయ సంస్థకు పాలు విక్రయించి డబ్బులు సంపాదించొచ్చన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న యూనిట్లను నెలకొల్పి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలన్నారు. సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాబూరావు, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్మోషన్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆర్డీవో రమేశ్బాబు, ఉద్యాన శాఖ అధికారి సత్తార్, ఏడీఏ భిక్షపతి, ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు విజయ్మోహన్రెడ్డి, గ్రామ సర్పంచ్ పెంటప్ప, ఎంపీటీసీ చంద్రమ్మ, తహసీల్దార్ ప్రేంకుమార్, ఎంపీడీవో మహేశ్, ఎంపీవో సంజీవ్కుమార్ వివిధ గ్రామాల సర్పంచ్లు సురేశ్, రాజు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.