న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: మానవులందర్నీ తుడిచిపెట్టే సామూహిక వినాశనాన్ని భూమి 25 కోట్ల సంవత్సరాల్లో చూడబోతున్నదని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఖండాలన్నీ అత్యంత సమీపానికి వస్తాయని, అప్పుడు ఏర్పడే ‘సూపర్ కాంటినెంట్’లో అధిక వేడి, ఉష్ణోగ్రతల కారణంగా జీవరాశి మనుగడ సాధ్యం కాదని ‘యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్’ సైంటిస్టులు అంచనావేశారు. శిలాజ ఇంధనాల్ని మండించటం, మానవ ప్రమేయంతో జరిగే కాలుష్యాన్ని అడ్డుకోవాలని, లేదంటే సామూహిక వినాశనం మరింత ముందుకు జరుగుతుందని పరిశోధనల్లో పాల్గొన్న ప్రొఫెసర్ బెంజమిన్ మిల్స్ చెప్పారు. ఈ నివేదిక ప్రకారం, 40 నుంచి 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్ని భరించే జీవరాశి మాత్రమే 25 కోట్ల సంవత్సరాల తర్వాత భూమిపై మనుగడ సాగించగలవు. సూపర్ కాంటినెంట్గా ఏర్పడటాన్ని సైంటిస్టులు ‘పాంజియా అల్టీమా’గా పేర్కొన్నారు.