షాబాద్ : జిల్లాలోని కాలేజీ విద్యార్థిని, విద్యార్థుల పెండింగ్ రెన్యూవల్, ఫ్రెష్-పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల వివరాలను ఈ నెల 21వ తేది లోపు తప్పనిసరిగా అందజేయాలని రంగారెడ్డి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన ఏ ఒక్క విద్యార్థికి ఉపకార వేతనం అందకపోయిన సంబంధిత కళాశాలల యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
మూడు సంవత్సరాలకు సంబంధించిన ఇంటర్మీడియట్ ఆపై చదువుతున్న, చదివిన విద్యార్థులు E pass WebSiteలో వారి ఆధార్, బ్యాంకు, కోర్సు తదితర అన్ని వివరాలను నమోదు చేసి సంబంధిత కళాశాలల లాగిన్లో నమోదు చేసుకున్నారని, ప్రిన్సిపాల్లు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి అర్హులైన విద్యార్థుల వివరాలను 21వ తేదిలోగా మా కార్యాలయానికి పంపించాలని కోరారు. 30వ తేది తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా లాగిన్ క్లోజ్ అవుతుందని చెప్పారు. ఉపకార వేతనాలు అందలేదని విద్యార్థులు వస్తే సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. కావున కళాశాలల ప్రిన్సిపాల్లు, విద్యార్థిని, విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోని పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాల హార్డు కాపీలను 21వ తేది లోగా సంయుక్త సంచాలకులు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, రంగారెడ్డి కార్యాలయానికి సమర్పించాలని కోరారు.