ఖమ్మం/హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భూపాలపల్లి/శ్రీరాంపూర్: కేంద్ర ప్రభుత్వం సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేట్పరం చేయడాన్ని నిరసిస్తూ సంస్థలోని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన 72 గంటల సమ్మెలో భాగంగా గురువారం చేపట్టిన కార్యక్రమం విజయవంతం అయ్యింది.
సంస్థవ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో జేఏసీ నాయకులు ప్రీ షిఫ్ట్ నుంచి అన్ని భూగర్భ గనులు, ఓపెన్కాస్టులు, డిపార్ట్మెంట్లు, కార్పొరేట్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున చేరి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు విధులకు హాజరుకాకుండా నిరసన వ్యక్తంచేశారు. అన్ని జీఎం కార్యాలయాలు, కొత్తగూడెంలోని కార్పొరేట్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. భోజన విరామం వరకు ధర్నా కొనసాగింది.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. సింగరేణిలో బొగ్గు బ్లాకులను ప్రైవేట్పరం చేయడం వల్ల నష్టం సంస్థకు మాత్రమే కాకుండా, బొగ్గు ఆధారిత పరిశ్రమలన్నింటిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీని వల్ల విద్యుత్తు సంస్థలకు పెద్దఎత్తున నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. సిమెంట్ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పారు.
కార్పొరేట్, ప్రైవేటు శక్తులకు బొగ్గు బ్లాకులు అప్పగిస్తే ఇష్టానుసారంగా ధరలు పెంచడమే కాకుండా భవిష్యత్తులో కార్మికుల సంఖ్య తగ్గిపోవడమే కాకుండా కారుణ్య నియామకాలు ఉండవని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుత్తు బిల్లుల మోతతోపాటు రైతులకు ఉచిత కరెంట్ ఉండదని, సామాన్యులపై నాలుగు రెట్లు ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే అప్పగిస్తే కార్మికులు, అధికారులు, ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని స్పష్టంచేశారు.
కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి సాగు చట్టాలను రద్దుచేసిన విధంగానే బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్మికులకు క్షమాపణ చెప్పి సింగరేణికి బొగ్గు బ్లాకులు ఇచ్చేంత వరకు విశ్రమించకుండా పోరాటాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంస్థవ్యాప్తంగా 11 ఏరియాల్లో మొదటి రోజు మొదటి షిఫ్టులో 27,559 మంది కార్మికులకు 23,388 మంది సమ్మెలో పాల్గొనగా, 3,410 మంది అత్యవసర సేవలకు హాజరయ్యారు. రెండో షిఫ్టులో 7,218 మంది కార్మికులకు 5,866 మంది సమ్మెలో పాల్గొనగా, 1,215 మంది అత్యవసర సేవలకు హాజరయ్యారు. సంస్థవ్యాప్తంగా రూ.80 కోట్ల విలువైన 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మికులు వేతనాల రూపంలో రూ.20 కోట్లు నష్టపోయారు.
సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు
సింగరేణి సమ్మెకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్మికుల పోరాటానికి అండగా నిలుస్తామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బొగ్గు గనులు జాతి సంపద అని, వాటిని ప్రజా ప్రయోజనాలకు కాకుండా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం సరికాదని హితవుపలికారు. తక్షణమే సింగరేణి సహా ఇతర బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్చేశారు.