‘అన్ని విభాగాల్లో బ్యాంక్ సరైన వృద్ధిని సాధించింది. వ్యాపార, లాభాలు, ఆస్తుల నాణ్యత ప్రమాణాలు పాటించింది. భవిష్యత్తులో వచ్చే షాక్లను తట్టుకునే స్థితికి బ్యాంక్ చేరుకున్నదని, బ్యాంక్ పనితీరు మెరుగుపడేదానిపై ఆశావాద దృక్పథంతో ఉన్నాను.
– దినేశ్ ఖారా, ఎస్బీఐ చైర్మన్
ముంబై, మే 13: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.9,114 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది. ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయి లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి. వడ్డీల మీద వచ్చే ఆదాయం పుంజుకోవడం, మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం బ్యాంక్కు కలిసొచ్చింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.6,451 కోట్ల నికర లాభాన్ని గడించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.81,327 కోట్ల నుంచి రూ.82,613 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.