న్యూఢిల్లీ, ఆగస్టు 6: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.6,068 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,504 కోట్ల లాభంతో పోలిస్తే 7 శాతం తగ్గిందని పేర్కొంది. ఆదాయం తగ్గడం ఇందుకు కారణమని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఏడాది క్రితం రూ.77,347.17 కోట్లుగా ఉన్న బ్యాంక్ స్టాండ్లోన్ మొత్తం ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.74,998.57 కోట్లకు దిగొచ్చినట్లు బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది.
బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 5.32 శాతం నుంచి 3.91 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ కూడా 1.7 శాతం నుంచి 1.02 శాతానికి తగ్గింది.
గత త్రైమాసికంలో కొత్తగా రూ.9,740 కోట్ల బకాయిలు మొండి బకాయిల జాబితాలోకి చేరాయి.
‘ఎంటీఎం నష్టంతో నికర, ఆపరేటింగ్ లాభాలపై ప్రతికూల ప్రభావం చూపింది. స్థూల ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధిని కనబరిచింది.
– దీనేశ్ ఖారా, ఎస్బీఐ చైర్మన్