న్యూఢిల్లీ, మార్చి 24: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. ఐదు హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలతో కో-లెండింగ్ ఒప్పందాలను కుదుర్చుకున్నది. పీఎన్బీ హౌజింగ్ ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ హోం ఫైనాన్స్, శ్రీరామ్ హౌజింగ్ ఫైనాన్స్, ఎడిల్వీస్ హౌజింగ్ ఫైనాన్స్, క్యాప్రీ గ్లోబల్ హౌజింగ్ ఫైనాన్స్లతో వ్యూహాత్మక కో-లెండింగ్ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు గురువారం బ్యాంక్ తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, అసంఘటిత కార్మికులకు తక్కువ వడ్డీరేట్లకే గృహ రుణాల మంజూరు లక్ష్యంగా ఈ కలయిక జరిగిందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ముఖ్యంగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల సొంతింటి కల సాకారం ఈ దేశంలో పెద్ద సమస్యగా ఉందని ఎస్బీఐ అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే మరిన్ని హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలతో కలిసి పనిచేసేందుకూ సిద్ధమని ప్రకటించింది. కాగా, 20:80 నిష్పత్తిలో ఈ ఒప్పందాల కింద హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు, ఎస్బీఐ రుణాలను మంజూరు చేస్తాయి. రుణ మొత్తంలో 80 శాతాన్ని ఎస్బీఐనే కస్టమర్లకు సమకూరుస్తుంది. అయితే డాక్యుమెంటేషన్, రుణాల పంపిణీ, వసూలు హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలే చూసుకుంటాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) సైతం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ పైసలో డిజిటల్తో కో-లెండింగ్ ఒప్పందాన్ని చేసుకున్నది. మహిళా ఎంటర్ప్రెన్యూర్స్తోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు చిన్నతరహా వ్యాపార రుణాలను అందించేందుకు ఈ భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్నది.