న్యూఢిల్లీ: ప్రపంచ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి దెబ్బ సగటు జీవితోపాటు అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థలపైనా బాగానే పడింది. గ్లోబల్ ఆయిల్ జెయింట్ సౌదీ అరామ్ కో సంస్థ లాభాలు 2020లో దాదాపు సగానికి కొడిగట్టిపోయాయి. 2019తో పోలిస్తే సౌదీ అరామ్ కో నికర లాభాలు 44.4 శాతం పతనం అయ్యాయి. దీనికి కారణం కరోనా మహమ్మారి ప్రభావంతో డిమాండ్ తగ్గిపోయి, చమురు ధరలు పడిపోవడం.. తదనుగుణంగా ఉత్పత్తి తగ్గించడం కూడా దీనికి కారణం అని తెలుస్తున్నది.2019లో సౌదీ ఆరామ్కోకు 88.2 బిలియన్ డాలర్ల ఆదాయం రాగా, 2020లో నికర ఆదాయం 49 బిలియన్ డాలర్లకు పతనమైంది.
2019 నుంచి లాభాల పతనం..
సౌదీ అరేబియాకు కామధేనువుగా పరిగణిస్తున్న సౌదీ అరామ్కోలో 2019 నుంచి లాభాలు పడిపోతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చమురు ప్రధానంగా సాగే సౌదీ సర్కార్ విభిన్న ప్రాజెక్టుల్లో పెట్టుబడుల దిశగా ప్రయాణం ప్రారంభించింది. అయితే, ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గి చమురుకు డిమాండ్ సాధారణ స్థాయికి చేరుకున్నది. ఇటీవలి కాలంలో ముడి చమురు ధర బ్యారెల్కు 60 డాలర్ల పై మార్క్ను దాటేసింది.
లాభాలు తగ్గినా డివిడెండ్ చెల్లింపునకే మొగ్గు
అయితే, లాభాలు తగ్గిపోయినా గతేడాది తమ వాటాదారులకు 75 బిలియన్ డాలర్ల డివిడెండ్ చెల్లించడానికే కట్టుబడి ఉన్నామని సౌదీ అరామ్కో స్పష్టం చేసింది. కష్టకాలంలో ఉన్న సౌదీ ఆరామ్కోను ఆదుకునేందుకు సౌదీ అరేబియా సర్కార్ ముందుకు వచ్చింది. వాటాదారులకు డివిడెండ్ చెల్లించడానికి సంస్థ ప్రధాన వాటాదారుగా సౌదీ సర్కార్ సాయం చేయనున్నది. గతంలోనే ఖర్చులు తగ్గించుకోవడానికి వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపివేసింది. అయితే 2021లో క్యాపిటల్ వ్యయం 35 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసింది సౌదీ ఆరామ్కో.
ఇవి కూడా చదవండి:
ఆపిల్పై బ్రెజిల్ 20 లక్షల డాలర్ల ఫైన్.. ఎందుకంటే!
స్క్రాపేజీ పాలసీతో 35 వేల కొలువులు!
షాకింగ్:ఇన్వెస్టర్ల కోసం ‘బిట్కాయిన్’ఏటీఎంలు.. ఎక్కడంటే!