BRS Maha Dharna | తెలంగాణ భవిష్యత్ ఆశాజ్యోతి కేటీఆర్ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనుల్లో ధైర్యం, భరోసా కల్పించడానికే కేటీఆర్ మానుకోటకు వచ్చారని తెలిపారు. కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇచ్చారని అన్నారు. మనం ధర్నా చేస్తుంటే రేవంత్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు. కేటీఆర్ బయటకు వస్తేనే రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో దళిత, గిరిజన, పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. పదేళ్లలో దేశానికే ఆదర్శంగా తెలగాణను కేసీఆర్ తీర్చిదిద్దారని అన్నారు. పదేళ్లు కేసీఆర్ అద్భుతమైన పాలన కొనసాగించారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ మహాధర్నాకు అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి భూములు లాక్కోవడమే పనిగా పనిచేస్తున్నారని అన్నారు. అడ్డుకున్న వారిపై కేసులు నమోదు చేయడమే మరో ఎజెండా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇది మానుకోట మాత్రమే కాదు.. మొత్తం తెలంగాణ గర్జన అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ మహాధర్నాతో కాంగ్రెస్ పాలకుల్లో వణుకు మొదలైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గిరిజన జాతి మొత్తం బీఆర్ఎస్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు.