చౌటుప్పల్, నవంబర్ 20: వృద్ధాప్యంలో తనకు ఆసరాగా ఉంటాడునుకున్న కొడుకు తిండి పెట్టకపోగా ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కూడా గుంజుకుంటున్నడని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడే మీడియాతో తన గోడును వెల్లబోసుకున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం దాచారం గ్రామానికి చెందిన అండెం అనసూయమ్మ (సుమారు 90 ఏండ్లు)కు ఐదుగురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. భర్త చనిపోవడంతో కొడుకు పిచ్చిరెడ్డి దగ్గరే కాలం గడుపుతున్నది. కొడుకు, కోడలు వేధిస్తుండటంతో రెండేండ్లుగా కూతుళ్ల వద్ద ఉంటున్నది. అయితే కొడుకు 20 నెలలుగా తన పింఛన్ తీసుకుంటున్నాడని, పింఛన్ పుస్తకం కూడా ఇస్తలేడని వాపోయింది. తన భర్త సంపాందించిన బంగారం గుంజుకున్నాడని ఆవేదన వ్యక్తంచేసింది. వీరి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి చావాలనుకుంటే తన కూతుళ్లే కాపాడారని బోరున విలపించింది. కొడుకు పిచ్చిరెడ్డిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని శనివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామన్నపేట సీఐ మోతీరామ్ మాట్లాడుతూ.. వృద్ధురాలి కొడుకు పిచ్చిరెడ్డికి కౌన్సెలింగ్ నిర్వహించామని, తీరు మారకపోతే భువనగిరి ఆర్డీవోకు కేసును బదిలీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.