మేడారం మహా జనసంద్రమైంది. తల్లుల కోసం నలుదిశల నుంచి పరుగుపరుగున తరలివచ్చిన బిడ్డలతో మహారణ్యం జనారణ్యమైంది. ఎటుచూసినా జనం.. పుట్టపగిలి చీమలొచ్చినట్టు! ఎటుచూసినా పారవశ్యం.. జనగంగ జంపన్నవాగులో ఓలలాడినట్టు! పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు ఇప్పటికే చేరుకోగా.. సారలమ్మ రాకతో మేడారం దేవనగరిగా మారిపోయింది. కన్నెపల్లి కల్పవల్లి పాదస్పర్శతో మహాజాతర తొలిఘట్టం ప్రారంభమైంది.
రెండేండ్ల ఎదురుచూపుల తర్వాత సారలమ్మ బుధవారం గద్దెకు చేరుకోవడంతో మేడారం భక్తిపారవశ్యంతో ఊగిపోయింది. కన్నెపల్లి- మేడారం దారంతా భక్తజనం ప్రణమిల్లింది. జంపన్నవాగు జన సందోహంతో పరవళ్లు తొక్కింది. తల్లి సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి గద్దెపైకి స్వాగతించేందుకు మేడారం ఒళ్లంత కండ్లు చేసుకొని ఎదురు చూస్తున్నది.
Medaram Jathara | ములుగు, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ): మేడారం మహా జాతరలో తొలి ఘట్టం నిర్విఘ్నం గా పరిపూర్ణమైంది. కన్నెపల్లి నుంచి తరలివచ్చిన సారలమ్మ బుధవారం అర్ధరాత్రి 12.12 గంటలకు గద్దెను అలంకరించింది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పలికారు. సారలమ్మను కనులారా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే కన్నెపల్లికి భక్తజనం పోటెత్తింది. సారలమ్మను తోడ్కోని వచ్చే ప్రధాన వడ్డె (పూజారి) కాక సారయ్య సహా ఆయనను అనుసరించే ఇతర వడ్డెలు గుడిలో ప్రత్యేక పూజలు చేశా రు. ఛత్తీస్గఢ్, బీజాపూర్, మహారాష్ట్రలోని సిరోంచ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీ, కోయ గిరిజనుల పూజా విన్యాసాలతో కన్నెపల్లి మార్మోగింది.
పూజల తరువాత కన్నెపల్లి నుంచి 16 మంది ఆడబిడ్డలు సంప్రదాయం ప్రకారం డోలి విన్యాసాలతో తరలివచ్చి తల్లీబిడ్డలైన సమ్మక్క-సారలమ్మ కొలువుదీరే గద్దెలపై ముగ్గులు పెట్టి కంకవనానికి కంకణాలు కట్టారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే కన్నెపల్లి సారలమ్మ గుడి వద్ద డోలి విన్యాసాలు, తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి పరిషత్, సారలమ్మ యువజన సంఘం బృందాల సారథ్యంలో కళా ప్రదర్శనలు కొనసాగాయి. అదే సమయంలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య సహా ఇతర పూజారులు సారలమ్మ గుడిలో వారి ఆచార సంప్రదాయాలను ఆచరించారు.
జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కన్నెపల్లి సారలమ్మ గుడి నుంచి మేడారంలోని గద్దెల వరకు తోడ్కోని బయల్దేరారు. కన్నెపల్లిలో ఇల్లిల్లూ తమ ఇంటి ఆడబిడ్డకు నీళ్లారగించి, చీరెసారె పెట్టి, కొబ్బరికాయలు కొడుతూ మంగళహారతులు పట్టారు. అక్కడినుంచి జంపన్న వాగుకు చేరుకోగా.. జంపన్న తన అక్క సారలమ్మ కాళ్లుకడిగి (జంపన్న వాగు మీద జంట వంతెనలు న్నా సరే కోయ జాతి సంప్రదాయం ప్రకారం వాగులోంచే సారలమ్మను తీసుకురావడం ఆనవాయితీ) మేడారానికి సాగనంపారు. జంపన్నవాగు నుంచి బయల్దేరిన సారలమ్మ మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకోగా.. అక్కడ పగిడిద్దరాజు, గోవిందరాజుల వడ్డెలు ఘనస్వాగతం పలికారు. అక్కడ ముగ్గురు దేవతల ప్రతినిధులు వారి వారి సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు.
సారలమ్మ మేడారానికి బయల్దేరిందన్న సమాచారం తెలియగానే మేడారం జాతర ప్రాంగణం నుంచి భక్తులు తండోపతండాలుగా కన్నెపల్లికి పరుగులు తీశారు. గుడి నుంచి బయలుదేరిన సారలమ్మ కన్నెపల్లి వాడవాడనా తిరగుతూ బిడ్డలకు దీవెనలిచ్చింది. ఇల్లిల్లూ సారలమ్మకు చీరె, సారె పోసి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం అత్యంత నియమ నిష్ఠల తో ఉదయం నుంచి ఉపవాసం ఉన్న ప్రధాన వడ్డె కాక సారయ్య ఆధ్వర్యంలో సారలమ్మ మేడారం గద్దెకు పయనమైంది. కన్నెపల్లి నుంచి మేడారానికి దాదాపు మూడు కిలోమీటర్ల పొడవునా దారికి ఇరువైపులా జనం పోటెత్తారు.
శివాలూగె శివసత్తుల పూనకాలతో జాతర మార్మోగింది. ఎదురుకోళ్లు సమర్పిస్తూ, ఒడిబియ్యం చల్లుతూ, కొబ్బరికాయలు కొడుతూ జనం సారలమ్మకు నీరాజనం పలికారు. కన్నెపల్లి నుంచి జంపన్నవాగు దాక ఒక దృశ్యం.. జంపన్నవాగు నుంచి మేడారం వరకు మరో దృశ్యం! ఈ రెండు దృశ్యాల నడుమ జంపన్నవాగు ఒక్కసారిగా కోల్..కోల్.. రాగాలతో ఓలలాడింది. ఉప్పొంగిన జంపన్న అక్క కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్నాడా అన్నంత ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది.
మేడారం పొలిమేరలోకి సారలమ్మ రాగానే సంబుర వాతావరణం వెల్లివిరిసింది. సారలమ్మ మేడారం గుడిలోకి చేరగానే ఆదివాసీ సంప్రదాయ విన్యాసాలతో డోలి మోతలు, కొమ్ము బూరల నాదాలతో దద్దరిల్లాయి. పూజలు నిర్వహించిన అనంతరం సారక్కను మేడారం గద్దెపై ప్రతిష్టించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు వారి వారి గద్దెలపై ఆసీనులయ్యారు.
మేడారం జాతరలో అత్యంత ఉద్విగ్నతకు లోనయ్యే ఘట్టం సమ్మక్క ఆగమనం. గురువారం చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి తరలి వచ్చి భక్తుల మొక్కులు అందుకోనున్నది. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్టయ్య సమ్మక్క తల్లిని గద్దెలపై ప్రతిష్టించనున్నారు.
జాతర సందర్భంగా ఆర్టీసీ బస్సులు అమ్మవార్ల గద్దెలకు అతి సమీపంలోకి వెళ్తాయని, భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా వనదేవతలను దర్శించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు.
మేడారం మహాజాతరపై ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు. గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు తెలిపారు.