రఘునాథపాలెం, జనవరి 16: ఖమ్మం నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. ఊరూవాడా పిల్లాజల్లా అందరూ కలిసి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. మహిళలు, యువతులు ముత్యాల ముగ్గులు వేయడంతో వాకిళ్లన్నీ మురిశాయి. పండుగ వాతావరణం అంతా పట్టణ ప్రాంతాల కంటే పల్లె ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించింది. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ పండుగలతో సందడి నెలకొంది. మూడు రోజులపాటు బంధుమిత్ర సపరివార సమేతంగా తమ ఇళ్లల్లో ఆనందోత్సాహాల నడుమ పండుగ చేసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా చేసిన పిండివంటల ఘుమఘుమలు అందరి మనసులనూ దోచుకున్నాయి. గంగిరెద్దులు, హరిదాసుల రాకతో సందడి మరింత పెరిగింది. డూడూ బసవన్నలు ఇంటి ముందుకు వచ్చి నాట్యమాడి ఆశీర్వదించారు. పిల్లలు, పెద్దలందరూ బసవన్నల దగ్గరకు వెళ్లి తినుబండారాలు తినిపించారు. తమ ఇంటికి వచ్చిన ధాన్యాన్ని వారి దోసిళ్లతో అందించారు. హరిదాసు కీర్తనలు వీనుల విందు చేశాయి.
పల్లెల్లో సందడి..
ఖమ్మం నియోజకవర్గంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. మకర సంత్రాంతి పర్వదినాన్ని ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లోని ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు. ప్రధానంగా పల్లెలు సంక్రాంతి సంబురాలతో కళకళలాడాయి. కొత్త అల్లుళ్లు, బంధుమిత్రుల రాకతో సరికొత్త సందడిని సంతరించుకుంది. ఉద్యోగాలు, ఇతర పనుల కోసం పట్టణాలకు వెళ్లిన వారంతా పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో సంక్రాంతిని మరింత సందడిగా జరుపుకున్నారు. భోగి నాడు చిన్నారుల తలలపై రేగి పళ్లు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి నాడు పెద్దల దీవెనలు అందుకున్నారు. అంతేగాక, గంగిరెద్దుల కోలాహలం కనిపించింది. సంక్రాంతి పండుగను వాకిళ్లను రంగవల్లులతో తీర్చిదిద్ది లక్ష్మీదేవికి స్వాగతం పలికారు. మూడోరోజు కనుమ పండుగను విశేషంగా నిర్వహించుకున్నారు. పిండివంటల ఘుమఘుమలు నోరూరించాయి. పలు గ్రామాల్లో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. సంక్రాంతి పండుక ప్రత్యేకమైన కోడిపందేలను తిలకించేందుకు మండల ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు ఆంధ్రా బాటపట్టారు. 5వ డివిజన్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలకు కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు నాగండ్ల కోటి, దండా జ్యోతిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. టీఆర్ఎస్ నాయకులు వెంకన్న, కోలేటి రాధాకృష్ణ, మేకల సుగుణారావు పాల్గొన్నారు.