పేదలు, గ్రామీణులు, మారుమూల ప్రాంతాల ప్రజలు, విధివంచితులు.. అందరికీ న్యాయసేవలు అందించడమే లక్ష్యంగా శనివారం సంగారెడ్డిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు చీఫ్ జస్టిస్ పాల్గొనే ఈ సదస్సుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. న్యాయసేవాధికార సంస్థ పనితీరు, ఉచిత న్యాయసేవల లభ్యత, కక్షిదారుల చట్టపరమైన హక్కుల గురించి సదస్సులో తెలియజేస్తారు. న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ, పేద ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు, సేవలను అందజేస్తారు. వివిధ ప్రభుత్వశాఖలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసింది.
సంగారెడ్డి, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : పేదలు, గ్రామీణులు, మారుమూల ప్రాంతాల ప్రజలకు న్యాయసేవలందించడమే లక్ష్యంగా పాన్-ఇండియా అవేర్నెస్ అండ్ ఔట్రీచ్ క్యాంపెయిన్లో భాగంగా సంగారెడ్డిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించనున్నారు. సంగారెడ్డి పట్టణ సమీపంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు న్యాయ విజ్ఞాన సదస్సు జరుగనున్నది. సదస్సుకు ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ హాజరుకానున్నారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, హై కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ టి.వినోద్కుమార్, తెలంగాణ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ రేణుక ఎర్ర, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి, సంగారెడ్డి సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ రమణకుమార్ న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొననున్నారు. సదస్సులో జిల్లా న్యాయవాదులు, పారాలీగల్ వలంటీర్లు, మహిళా సం ఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొనున్నారు. ‘ఆజాదీకా అమృత్’ ఉత్సవాల్లో భాగంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పాన్-ఇండియా అవేర్నెస్ అండ్ ఔట్రీచ్ పేరుతో సదస్సులు నిర్వహిస్తున్నది. న్యాయసేవాధికారి సంస్థ గ్రామీణ, పేద ప్రజలకు ఉచిత న్యాయ సలహాలను, సేవలను అందజేస్తారు. ఈ అంశాన్ని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు మరింతగా తీసుకెళ్లేందుకు నేషనల్ లీగల్ సెల్ అథారిటీ దేశవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఆదివారం సంగారెడ్డిలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు ద్వారా న్యాయసేవాధికార సంస్థ పనితీరు, ఉచిత న్యాయసేవల లభ్యత, కక్షిదారుల చట్టపరమైన హక్కులు గురించి వివరించనున్నారు. ప్రభుత్వాలు, ప్రభుత్వం సంస్థల నుంచి లబ్ధిపొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తిరస్కరణకు గురైన దరఖాస్తుదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. జిల్లా న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం, జిల్లా కోర్టు సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు న్యాయ విజ్ఞాన సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. న్యాయవిజ్ఞాన సదస్సులో వివిధ ప్రభుత్వశాఖలు, పోలీసుశాఖ స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నాయి.
అధికారుల సమాచారం మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఉచిత న్యాయసేవల లభ్యతను వివరిస్తూ స్టాల్ను ఏర్పాటు చేస్తున్నది. పల్లె ప్రగతిపై పంచాయతీ శాఖ, పట్టణ ప్రగతిపై సంగారెడ్డి మున్సిపాలిటీ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. డీఆర్డీఏ, వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, స్త్రీ శిశు సంక్షేమశాఖ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ, నీటిపారుదలశాఖ, అటవీశాఖ, మిషన్భగీరథ, పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖ, చేనేతశాఖలు తమ శాఖల పనితీరు ను వివరిస్తూ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. రెవెన్యూశాఖ అధికారులు ధరణి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అమలుపై స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నది. పోలీసుశాఖ భరోసా కేంద్రాల నిర్వహణ, షీటీమ్స్ పనితీరు, ట్రాఫిక్ రూల్స్ అమలు తెలియపరుస్తూ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నది.
ఉచిత న్యాయ సేవలపై చైతన్యం కల్పించాలి
-రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ రేణుక
సంగారెడ్డి, అక్టోబర్ 23 : నేటికి గ్రామీణ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలపై అవగాహన లేకపోవడం ఆందోళన కలిస్తున్నదని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ రేణుక అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో రేణుక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఆదివారం కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ శివారులోని గోకుల్ గార్డెన్లో సదస్సు ఏర్పాటు చేశామన్నారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉదయ్ ఉమేశ్ లలిత్, రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు ఉజ్జల్ భూయాన్, వినోద్ కుమార్ హాజరు కానున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా అదనపు సెషన్స్ జడ్జి కవిత, ఏడవ అదనపు సెషన్స్ జడ్జి కర్ణకుమార్, జిల్లా ఐదవ అదనపు సెషన్స్ జడ్జి మైత్రేయి, రెండవ అదనపు సెషన్స్ జడ్జి అనిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఆశాలత, సీనియర్ సివిల్ జడ్జి పుష్పలత, జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ జలీల్, జేఎఫ్సీఎం ఎక్సైజ్ న్యాయమూర్తి హనుమంతరావు, బార్ అసోసియేషన అధ్యక్షుడు విష్ణువర్ధ్దన్రెడ్డి ఉన్నారు.