నారాయణఖేడ్, నవంబర్ 11: రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని సహించబోమని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ ఏర్పడి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రైతుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, సాగు నీటి ప్రాజెక్టుల అభివృద్ధి, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో పాటు ఒక దఫా రూ.1లక్ష పంట రుణ మాఫీ చేయడమే కాకుండా మరో దఫా విడతల వారీగా రూ.1లక్ష రుణ మాఫీకి చర్యలు చేపట్టిందన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులను సరఫరా చేస్తూ పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం వడ్లను కొనుగోలు చేయమంటూ రైతుల నోట్లో మట్టి కొడుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ వడ్ల కొనుగోలు విషయంలో వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నెపాన్ని తమ ప్రభుత్వంపై నెడుతున్నాయన్నారు. వడ్ల కొనుగోలుకు కేంద్రమే డబ్బులిస్తుందని చెబుతూ మరో వైపు డబ్బులు లేకే రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఈ విషయంలో రైతులు బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని, రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం నారాయణఖేడ్లో నిర్వహించనున్న మహాధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.