నేడు రైతుల కోసం సిద్దిపేట జిల్లా వ్యవసాయశాఖ అధికారితో ఫోన్ ఇన్ ఉదయం 10 నుంచి 11గంటల వరకు కార్యక్రమం అన్నదాతలకు ఫోన్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఆరుతడి పంటల్లో పల్లికాయ (వేరుశనగ) ప్రధానమైనది. నూనెగింజల పంటల్లోనూ ఈ పంటకు ప్రత్యేక స్థానముంది. పల్లినూనెకు ఉన్న గిరాకీ నేపథ్యంలో ఈ పంట సాగుచేసి మంచి ఆదాయం పొందాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. యాసంగిలో పల్లికాయ సాగు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. మనదగ్గర ఈ పంట పండించేందుకు అనువైన భూములున్నాయి. ఎకరాలో వరి సాగుచేసే కంటే పల్లికాయ వేస్తే ఎంతో లాభమని అధికారులు సూచిస్తున్నారు. ఎకరా పల్లికాయ సాగుకు సుమారు రూ.15వేలు ఖర్చవుతుంది. పెట్టుబడులు పోను రైతుకు ఎకరాకు రూ.50వేల ఆదాయం పొందవచ్చు. అదే ఎకరా వరి సాగుచేసేందుకు కనీసం రూ.20వేల పెట్టుబడి అవుతుంది. పెట్టుబడి పోనూ ఎకరాకు రైతుకు మిగిలేది కేవలం రూ.30,440 మాత్రమే. ఎకరా వరి సాగుకు వినియోగించే నీటితో మూడెకరాల్లో పల్లికాయ పండించవచ్చు.
హుస్నాబాద్, నవంబర్ 10 : ఆరుతడి పంటల్లో పల్లికాయ పంట(వేరుశనగ) ప్రధానమైనది. నూనెగింజల పంటల్లోనూ వేరుశనగకు ప్రత్యేక స్థానముంది. ప్రస్తుతం పల్లి నూనెకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. మార్కెట్లో పల్లి నూనెకు ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని రైతులు ఈ యాసంగిలో పల్లికాయ పంటను సాగుచేస్తే మంచి ఆదాయం పొందవచ్చని వ్యవసాయాధికారులు, ఆర్థిక నిపుణులు అంటున్నారు. సిద్దిపేట జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో పల్లికాయ సాగు చేసుకునేందుకు అనువైన భూములు ఉన్నాయి. ఇసుకతో కలిపి ఉన్న భూములతో పాటు ఎర్రచెల్క భూములు ఎక్కువగా ఉన్నందున వరికి ప్రత్యామ్నాయంగా పల్లికాయ మంచిదనేది నిపుణుల అభిప్రాయం. ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వాలు సూచిస్తున్న తరుణంలో రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ యాసంగిలో పల్లికాయ సాగు చేసి, వరికంటే ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంది.
విత్తనాల ఎంపిక.. విత్తుకునే విధానం..
యాసంగి సీజన్లో పల్లికాయ సాగుకు మొదట నాణ్యమైన విత్తన రకాలను రైతులు ఎంచుకోవాలి. ఇందులో స్పానిష్ గుర్తి, వర్జీనియా గుత్తి అనే రెండు రకాలుంటాయి. స్పానిష్ రకాల్లో కదిరి-6, కదిరి-9, అనంత, కదిరి హరితాంధ్ర, ఐసీజీవి-91114, ధరణి, టీఏజీ-24రకాల విత్తనాలు ఉన్నాయి. వర్జీనియా రకాల్లో కదిరి-7, కదిరి-8బోల్ట్ రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇసుకతో కూడిన గరపనేలలు, నీరు త్వరగా ఇంకె ఎర్ర చెల్క నేలలు ఈ పంటకు అనువుగా ఉంటా యి. బంకమన్ను, నల్లరేగడి భూములు ఈ పంటకు అనుకూలం కాదు. విత్తుకునే సమయంలో ఒక చదరపు మీటరుకు 44మొక్కలు ఉండేలా చూసుకోవాలి. విత్తనాలను 5 సెంటీమీటర్ల లోతుకంటే ఎక్కువ లోతులో వేయకూడదు.
పంటకు ఆశించే తెగుళ్లు.. నివారణ చర్యలు..
పల్లికాయకు సోకే తెగుళ్లలో ముఖ్యమైనవి వేరుపురుగు, ఆకుముడత పురుగు, పొగాకు లద్దె, శనగపచ్చ, తామర, పచ్చ దీపపు, మొగ్గతొలుచు పురుగు, తాక్కా ఆకుమచ్చ తెగులు, మొదలుకుళ్లు, వేరుకుళ్లు, కాండంకుళ్లు, మొవ్వ కుళ్లు, కుంకుమ తెగులు ఎక్కువగా పంటకు ఆశిస్తాయి. తెగులు లక్షణాలను ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులకు చెబితే, తగిన సస్యరక్షణ చర్యలు వివరిస్తారు. అవసరమైతే క్షేత్ర పర్యటన చేసి, చర్యలు తీసుకుంటారు.
విత్తన రకాలు.. వచ్చే దిగుబడులు..
పల్లికాయలో విత్తన రకాలను బట్టి దిగుబడులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కదిరి-6 విత్తన రకంతో యాసంగిలో ఎకరాకు 12 నుంచి 14క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కదిరి-9 విత్తనం సాగు చేస్తే ఎకరాకు 10నుంచి 12క్వింటాళ్లు, కదిరి హరితాంధ్రతో 10నుంచి 12, ధరణి ద్వారా 9నుంచి 10, టీఏజీ-24ద్వారా 8నుంచి 10, జేఎల్-24ద్వారా 10నుంచి 11, ఐసీజీవీ-91114 ద్వారా 10నుంచి 12, కదిరి-7,8 ద్వారా 12నుంచి 14క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన కదిరి లేపాక్షి-1812 రకం విత్తనంతో ఎకరానికి 15 నుంచి 18క్వింటాళ్ల దిగుబడి కూడా వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఎరువులు, యాజమాన్య పద్ధతులు…
పల్లికాయ వేసే ముందు భూసార పరీక్ష చేయించుకుంటే అందుకు అనుగుణంగా ఎరువులను వాడొచ్చు. దుక్కిలో 3 నుంచి 4టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. ఎకరానికి 100కిలోల సూపర్ ఫాస్పేట్, 33కిలోల పొటాష్, 18కిలోల యూరియాను విత్తనాలు వేసే సమయంలోనే వాడాలి. 30రోజుల తర్వాత తొలిపూత దశలో మరో 10నుంచి 15కిలోల యూరియా వేసుకోవాలి. ఊడలు దిగే సమయంలో ఎకరానికి 200కిలోల జిప్సమ్ను మొక్క మొదళ్ల దగ్గర వేసి మట్టితో కూడ్పాలి. జింక్ లోపంతో ఆకుల చిన్నవిగా మారతాయి. ఇందుకు ఎకరాకు 400గ్రాముల జింక్సల్ఫేట్ను 200లీటర్ల నీటితో కలిపి వారం రోజుల్లో రెండుసార్లు పంటపై పిచికారీ చేయాలి. ధాతు లోపంతో ఆకులు పసుపు పచ్చగా, ఆ తర్వాత తెలుపు రంగుకు మారే ప్రమాదం ఉన్నందున ఎకరాకు ఒక కిలో అన్నభేధి, 200గ్రాముల సెట్రిక్ ఆమ్లం 200లీటర్ల నీటితో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. కలుపు గడ్డి నివారణకు విత్తనాలు విత్తిన వెంటనే లేదా 48 గంటల్లోపు అలాక్లోర్ 50శాతం ఈసీ 1.5 నుంచి 2లీటర్ల మందును 200లీటర్ల నీటితో కలిపి దుక్కిపై పిచికారీ చేయాలి.
‘వరి’ కంటే పల్లికాయే లాభదాయకం…
ఒక ఎకరంలో వరి సాగుచేసే కంటే పల్లికాయ వేస్తే ఎంతో లాభం. ఎకరం పల్లికాయ సాగుకు సుమారు రూ.15వేలు ఖర్చు అవుతుంది. ఎకరానికి సగటున 10క్వింటాళ్ల పల్లికాయ పండుతుంది. ప్రభుత్వం క్వింటాలు పల్లికాయకు రూ.5,550 మద్దతు ధర ఇస్తున్నప్పటికీ ప్రస్తుతం మార్కెట్లో రూ.7వేల నుంచి 9వేల వరకు ధర పలుకుతోంది. సగటున క్వింటాలు ధర రూ.6,500 వచ్చినా రైతుకు ఎకరాకు రూ.65వేల ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోనూ రైతుకు ఎకరాకు రూ.50వేలు మిగిలే అవకాశం ఉంది. ఎకరం వరి పంట సాగుచేసేందుకు కనీసం రూ.20వేల పెట్టుబడి అవుతుంది. సగటున ఎకరాకు 26 క్వింటాళ్ల వడ్లు పండుతాయి. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం క్వింటాలుకు రూ.1,940 ఉంది. ఎకరం వరి సాగు చేసిన రైతుకు రూ.50,440 ఆదాయం వస్తుంది. పెట్టుబడి రూ.20వేలు పోనూ ఎకరాకు రైతుకు మిగిలేది కేవలం రూ.30,440 మాత్రమే. ఒక ఎకరం వరి సాగు చేసేందుకు వినియోగించే నీటితో మూడెకరాల పల్లికాయ సాగు చేసుకోవచ్చు. రైతులు ఈ యాసంగిలో పల్లికాయ సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
పల్లికాయతో మంచి లాభాలు..
ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నందున పల్లికాయ పండించడం మంచిది. మంచి విత్తన రకాన్ని వేస్తే, వరికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. వానకాలంలో నేను రెండెకరాల్లో పల్లికాయ వేశిన. ఈ యాసంగిలో ఐదు ఎకరాల్లో సాగుచేస్తున్న. ఎందుకంటే యాసంగిలో ఎండలు ముదిరేకొద్దీ నీళ్లు తగ్గుతాయి. వరికి నీళ్లు సరిపోకుంటే ఎండిపోతుంది. కానీ, పల్లికాయకి తక్కువ నీళ్లతో ఎక్కువ లాభాలు వస్తాయి. రైతులు ఈ పంట పండించి, యాసంగిలో లాభాలు పొందాలని ఆశిస్తున్నా.
కొత్తరకం విత్తనంతో మంచి దిగుబడులు..
రాయలసీమ నుంచి ఇటీవల దిగుమతి చేసుకున్న కొత్తరకం విత్తనం కదిరి లేపాక్షి-1812 సాగుచేసిన రైతులకు దిగుబడులు పెరిగాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది రైతులు ఇదే విత్తన రకాన్ని వాడుతున్నారు. ఇంతకు ముందున్న విత్తన రకాలతో కూడా మంచి దిగుబడులు పొందొచ్చు. యాసంగిలో వరి కంటే, వేరుశనగ సాగు చేసుకోవడం ఎంతో ఉత్తమం. చివరి దశలో నీరందక వరి ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. రైతులు వేరుశనగ సాగు చేసుకొని ఆదాయాన్ని పెంచుకోవాలి.