కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీకి (Sandeshkhali row) చెందిన ఇద్దరు మహిళలు యూటర్న్ తీసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై అత్యాచారం ఫిర్యాదును ఒక మహిళ, ఆమె అత్త వెనక్కి తీసుకున్నారు. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు బీజేపీకి చెందిన వ్యక్తులు తెల్ల కాగితంపై తమ నుంచి సంతకాలు తీసుకున్నారని వారు ఆరోపించారు. సందేశ్ఖాలీ ఘటనలో పార్టీ పాత్ర ఉందని ఒక బీజేపీ కార్యకర్త పేర్కొన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఈ పరిణామం నేపథ్యంలో సందేశ్ఖాలీకి చెందిన మహిళ బుధవారం మీడియాతో మాట్లాడింది. జాతీయ మహిళా కమిషన్ బృందం ద్వీపాన్ని సందర్శించినప్పుడు తమ సమస్యలు చెప్పాలని బీజేపీకి చెందిన పియాలి అనే మహిళ అడిగిందని తెలిపింది. వంద రోజుల ఉపాధి పథకానికి సంబంధించిన డబ్బు అందలేదని తాను చెప్పానని, వేరే ఫిర్యాదు లేదన్నానని చెప్పింది. అయితే పియాలీ తెల్ల కాగితాలపై తమ సంతకాలు తీసుకున్నట్లు ఆ మహిళ ఆరోపించింది. అనంతరం స్థానిక టీఎంసీ నాయకులు అత్యాచారం చేశారని ఆరోపించిన మహిళల జాబితాలో తాను, తన అత్త ఉన్నట్లు తెలిసి షాక్ అయ్యామని అన్నది.
మరోవైపు ఎలాంటి తప్పుడు ఫిర్యాదులతో సంబంధం ఉండకూడదనుకుంటున్నామని ఆ మహిళ తెలిపింది. ఇరుగుపొరుగు వారు ఎవరూ తమతో మాట్లాడడంలేదని చెప్పింది. అందుకే తమ ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. టీఎంసీ నేతలపై ఫిర్యాదు ఉపసంహరణ నేపథ్యంలో బహిష్కరణల పేరుతో తమకు బెదిరింపులు వస్తున్నాయని ఆ మహిళ ఆరోపించింది. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అలాగే బుధవారం ఆ మహిళ, ఆమె అత్త స్టేట్మెంట్ను మెజిస్ట్రేట్ సమక్షంలో పోలీసులు రికార్డ్ చేశారు.