హైదరాబాద్: టీమిండియా మెన్స్ క్రికెట్ జట్టు ఇప్పటి వరకు 999 వన్డే మ్యాచ్లు ఆడింది. ఇక రేపు అహ్మదాబాద్లో ఇండియన్ టీమ్ వెయ్యో వన్డే ఆడనున్నది. రోహిత్ నేతృత్వంలోని భారత జట్టు ఆ ఘనతను అందుకోనున్నది. అయితే ఇండియా ఆడిన వన్డేల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ ప్రత్యేకమైంది. 1974లో ఇండియా తొలిసారి ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో పాల్గొన్నది. 48 ఏళ్ల తర్వాత ఇండియా 1000వ వన్డే ఆడేందుకు సిద్ధమైంది. 518 వన్డేల్లో ఇండియా విజయం సాధించింది. 431 మ్యాచుల్లో ఓడింది. 9 వన్డేలు టై అయ్యాయి. అయితే ఇండియా ఆడిన 999 వన్డేల్లో.. సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 463 వన్డేలు ఆడాడు. భారత్ ఆడిన 200వ, 300, 400, 500, 600, 700, 800వ మ్యాచ్ల్లో సచిన్ ప్రాతినిధ్యం వహించాడు.
పాకిస్థాన్లోని గుజ్రాన్వాలాలో డిసెంబర్ 18, 1989లో జరిగిన వన్డేలో సచిన్ అరంగేట్రం చేశాడు. పాక్తో జరిగిన తొలి వన్డేలో సచిన్ పరుగులేమీ చేయలేదు. అయితే రెండవ వన్డే పెషావర్లో జరగాల్సి ఉంది. కానీ వాతావరణం సరిగా లేని కారణంగా ఆ మ్యాచ్ను రద్దు చేశారు. కానీ పీసీబీ అభ్యర్ధన మేరకు ఆ మ్యాచ్ను 20 ఓవర్ల కోసం నిర్వహించారు. స్టేడియంలో ప్రేక్షకులను నిరాశపరచరాదన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ మ్యాచ్లో 17 బంతుల్లోనే సచిన్ 53 రన్స్ చేశాడు. ఇప్పటి టీ20లతో పోలిస్తే అది మంచి స్ట్రయిక్ రేట్. ఆ మ్యాచ్ తర్వాతే టీమ్ మేనేజ్మెంట్ తన గురించి ఆలోచించడం మొదలుపెట్టినట్లు సచిన్ తెలిపాడు. అందుకే తాను 1989లోనే తొలి టీ20 మ్యాచ్ ఆడినట్లు సచిన్ ఓ పత్రికు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.