ఎదులాపురం, జూలై 6 : వానకాలం సీజన్లో ఎవరైనా రైతులు గంజాయి సాగు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు రైతుబంధును నిలిపివేస్తామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో తన కార్యాలయ ఛాంబర్లో పోలీస్, ఎక్సైజ్, అటవీ, వ్యవసాయ, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులకు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు , మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చేయాలని ఆదేశించారు.
గంజాయి వంటి మత్తు పదార్థాలను అక్రమ రవాణా, వినియోగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారిని గుర్తించి మానసిక వైద్యులతో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై నిరంతరణ పర్యవేక్షణ చేపడుతున్నామని, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో ఆర్డీవో రాథోడ్ రమేశ్, జిల్లా ఎక్సైజ్ అధికారి హిమశ్రీ, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, వ్యవసాయాధికారి పుల్లయ్య, ఎస్సీ సంక్షేమ అధికారి సునీత కుమారి, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రైస్ మిల్లులు పరిశీలన
ఆదిలాబాద్ రూరల్, జూలై 6 : మిల్లింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి సకాలంలో బియ్యం నిల్వలను సరఫరా చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆదిలాబాద్ గ్రామీణ మండలం రాంపూర్లోని వినాయక ట్రేడర్స్, సాయి అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ధాన్యం నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైస్ మిల్లర్లు త్వరగా మిల్లింగ్ ప్రక్రియను చేపట్టి పౌర సరఫరాల శాఖకు సకాలంలో బియ్యం నిల్వలు అందించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి కిరణ్కుమార్, జిల్లా మేనేజర్ సుధారాణి ఉన్నారు.