జగిత్యాల రూరల్, జనవరి 6: ఇగురంతో వ్యవసాయం చేస్తే మంచి లాభాలు పొందవచ్చని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలంలోని జాబితాపూర్ గ్రామ శివారులో లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు మల్లారెడ్డి తన ఏడెకరాల వ్యవసాయ క్షేత్రంలో పండిన వివిధ రకాల కూరగాయలు, పండ్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు ఇస్తున్న సందర్భంగా గురువారం జై కేసీఆర్ అని రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, వ్యవసాయ అధికారులతో కలిసి కేక్ కట్చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం రైతు ఎడమల మల్లారెడ్డి మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో సైతం రైతుబంధు లేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. మరణించిన రైతులకు సైతం రైతుబీమాతో అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు.
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, వివిధ రకాల పంటలు విభిన్నంగా పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతు మల్లారెడ్డిని అభినందించారు. డిమాండ్ ఉన్న పంటలు పండిస్తూ ఇతర రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడని కొనియాడారు. ప్రతి రైతు కూడా డిమాండ్ ఉన్న పంటలతో పాటు వేరుశనగ, నువ్వులు, పప్పు దినుసులు, సాగు చేస్తూ మంచి లాభాలు పొందాలని సూచించారు.
అనంతరం జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ, ఒకప్పుడు రైతు వ్యవసాయం పెట్టుబడికి నగలు తాకట్టు పెట్టే పరిస్థితి ఉండేదని, స్వరాష్ట్రంలో ఆ బాధ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడి రూపంలో తీరిందన్నారు. నేడు ప్రతి రైతు స్వతహాగా రైతుబంధు సంబురాలు చేసుకోవడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా రైతు మల్లారెడ్డి ఏర్పాటు చేసిన ఎండ్లబండిపై క్షేత్రానికి చేరుకున్న తన వద్దే తయారైన తేనెతో ముఖ్యమంత్రి చిత్రపటానికి అభిషేకం చేశారు. అనంతరం క్షేత్రమంతా కలియతిరిగి విభిన్న పంటలను పరిశీలించారు. మల్లారెడ్డి సాగు విధానాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం ఇటీవల ట్వీట్ చేయగా ఆ ట్వీట్ను ఆయన క్షేత్రంలో ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నాడు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్కుమార్, ఎంపీపీ పాలెపు రాజేంద్రప్రసాద్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి, మండలాధ్యక్షుడు బాల ముకుందం, జాన్, రాజిరెడ్డి, గంగారెడ్డి, అంకం సతీశ్, నారాయణ గౌడ్, శంకర్, చంద్రారెడ్డి, ఏఈవో హరీశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.