ఐరాస, ఏప్రిల్ 7: అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం(యూఎన్హెచ్ఆర్సీ) నుంచి రష్యాను బహిష్కరిస్తూ యూఎన్ జనరల్ అసెంబ్లీ నిర్ణయం తీసుకొన్నది. అంతకు ముందు ఈ తీర్మానంపై జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. ఈ తీర్మానాన్ని అమెరికా ప్రవేశపెట్టింది. 193 సభ్య దేశాలున్న ఐరాసలో తీర్మానానికి మద్దతుగా 93 దేశాలు ఓటేశాయి. 24 దేశాలు వ్యతిరేకించాయి. 58 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. రష్యాకు వ్యతిరేకంగా గత నెలలో ప్రవేశపెట్టిన తీర్మానాలకు ప్రపంచ దేశాలు ఏకపక్షంగా మద్దతివ్వగా తాజాగా ఆ వ్యతిరేకత తగ్గడం గమనార్హం. ఈ తీర్మానాలన్నింటిపైనా ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. తీర్మానం ఆమో దం పొందడంపై ఉక్రెయిన్ హర్షం వ్యక్తం చేసింది. మద్దతిచ్చిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపింది. యుద్ధ నేరస్థులు సభకు ప్రాతినిధ్యం వహించకూడదని పేర్కొన్నది. మరోవైపు, రష్యా స్పందిస్తూ.. ఈ నిర్ణయం అక్రమమని, రాజకీయ ప్రేరేపితమైనదని మండిపడింది.
రష్యా మారణహోమాన్ని అడ్డుకోవాలంటే తమకు మరిన్ని ఆయుధాలను అందించాలని ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది. సైనిక సాయం చేయకపోయినా కనీసం ఆయుధాలనైనా ఇవ్వాలని నాటోను వేడుకొన్నది. ఉక్రెయిన్కు మద్దతునిచ్చే అంశంపై బ్రస్సెల్స్లో గురువారం నాటో విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. సమావేశంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా పాల్గొన్నారు. ‘మాకు ఎలా పోరాడాలో తెలుసు. కానీ ఆయుధాలు లేకపోతే ఎంతోమంది ప్రాణాలను కోల్పోవాల్సి వస్తున్నది. మేం కోరేది ఒక్కటే. ఆయుధాలు.. ఆయుధాలు.. ఆయుధాలు. ఆయుధాలు కావాలి. ఎంత త్వరగా ఉక్రెయిన్కు ఆయుధాలు అందితే అంత ఎక్కువ మంది ప్రాణాలను రక్షించుకొన్నవాళ్లం అవుతాం’ అని నాటోను ఉద్దేశించి అన్నారు. ఇదిలా ఉండగా, కీవ్ను విడిచి వెళ్లాలని పౌరులకు సూచించింది. ఆరువారాలు గడిచినా కీవ్ చిక్కకపోవడంతో రష్యా సైనికులు గురువారం నగర శివార్ల నుంచి వెనక్కు వెళ్లారు. ఉక్రెయిన్లోని తూర్పు ప్రాంతాల స్వాధీనంపై ప్రధానంగా దృష్టి పెట్టారు.
చమురు దిగుమతుల్లో భారతదేశానికి మద్దతివ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు అమెరికా పేర్కొన్నది. తమ ఆంక్షలను కాదని భారత ప్రభుత్వం రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడంపై అమెరికా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆ దేశం మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కింది.