వాషింగ్టన్: ఉక్రెయిన్పై సమరభేరి మోగించిన రష్యా.. తొలి రోజే అత్యంత కీలకమైన చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నది. రష్యా సైనిక బలగాలు ఆ ప్లాంట్ను ఆక్రమించేశాయి. ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన పుతిన్.. ఆ ఎత్తులో చెర్నోబిల్కే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ను హస్తగతం చేసుకోవాలంటే చెర్నోబిల్ రూట్ కీలకం. బెలారస్ నుంచి కీవ్కు వెళ్లేమార్గంలో చెర్నోబిల్ ఉంటుంది. ఇక ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యాకు ఈ రూట్లో వెళ్తే పని ఈజీ అవుతుంది. ఇటీవల బెలారస్ వద్ద సైనిక విన్యాసాలు చేపట్టిన రష్యా.. ఆ దేశ సరిహద్దుకు సమీపంలో ఉన్న చెర్నోబిల్ను వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ వేసింది. అత్యంత వేగంగా ఉక్రెయిన్ను దెబ్బతీయాలంటే చెర్నోబిల్ రూటే ప్రధానమైంది. అది కూడా బెలారస్ మార్గం ద్వారా ఆ ప్లాన్ను అమలు చేస్తోంది. కీవ్లోకి రష్యా బలగాలు వేగంగా వెళ్లాంటే చెర్నోబిల్ అణుకేంద్ర మార్గమే ముఖ్యమైంది.
నిజానికి చెర్నోబిల్ సైనిక కేంద్రం కాదు. మిలిటరీలో ఈ ప్రాంతానికి ప్రాధాన్యం లేదు. కానీ బెలారస్ నుంచి కీవ్ మధ్య అత్యంత కనిష్ట దూరం ఈ రూట్లోనే ఉంటుంది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా నిర్వీర్యం చేయాలంటే రష్యాకు ఇదే సులువైన మార్గం. చెర్నోబిల్ను రష్యా ఆక్రమించినట్లు ఉక్రెయిన్ వెల్లడించినా.. అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఆ విషయాన్ని నమ్మడం లేదు.
కీవ్కు ఉత్తర దిశలో 108 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెర్నోబిల్కు ప్రత్యేక చరిత్ర ఉంది. 1986లో ఆ అణు కేంద్రం పేలింది. దీంతో అక్కడ భారీ స్థాయిలో రేడియేషన్ విడుదలైంది. ఆ రేడియేషన్ కాస్త యూరోప్ దేశాలకు పాకింది. స్ట్రోనియమ్, సీసియమ్, ప్లూటోనియం లాంటి అణుధార్మిక పదార్ధాలు అక్కడ ఇప్పటికీ తీవ్ర అస్వస్థతను కలిగిస్తున్నాయి. చెర్నోబిల్ ప్రమాదం వల్ల వేలాది మంది మరణించారు. లక్షలాది మంది క్యాన్సర్కు లోనయ్యారు. సోవియేట్ యూనియన్ కాంక్ష కోసం తపించిన మాజీ నేత మైఖేల్ గోర్బచోవ్ మొదటల్లో ఈ విషాదం గురించి ప్రపంచానికి చెప్పలేదు. కానీ ఆ విషాదం పెను ప్రాణ నష్టాన్ని మిగిల్చింది.
ఉక్రెయిన్లో ప్రస్తుతం నాలుగు అణు విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. అవన్నీ సురక్షితంగానే పనిచేస్తున్నాయి. ఒకవేళ రష్యా ఆక్రమణకు వస్తే మళ్లీ చెర్నోబిల్ విషాదం చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చారు. 1986 లాంటి ఘటన మళ్లీ జరగకుండా ఉండేందుకు తమ దళాలు ప్రయత్నిస్తున్నట్లు అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. చెర్నోబిల్ను రష్యా ఆక్రమించడమంటే.. అది యూరోప్పై యుద్ధం ప్రకటించినట్లే అని ఆయన అన్నారు. చెర్నోబిల్ స్వాధీనంతో తీవ్రమైన పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి తెలిపారు.
చెర్నోబిల్ ప్లాంట్ చుట్టూ ఇప్పటికే 32 కిలోమీటర్ల పరిధి వరకు మనుషులెవరూ ఉండరు. 36 ఏళ్ల నుంచి ఆ ప్రాంతంలో మానవ సంచారమే లేదు. ఆ ప్లాంట్లో ఉన్న మూడు రియాక్టర్లను 2000 సంవత్సరంలోనే మూసివేశారు. 1986లో జరిగిన లీకేజీ వల్ల అక్కడ రేడియేషన్ ప్రమాదకర స్థాయిలో ఉంది. ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్లిన రష్యా బలగాలు చెర్నోబిల్ ఎక్స్క్లూజివ్ జోన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న సిబ్బందిని రష్యా సైనికులు బంధించినట్లు వైట్హౌజ్ వెల్లడించింది.
చెర్నోబిల్ సమీపంలో ఉన్న డిప్రో నది ప్రాంతం కూడా కీలకమైంది. బెలారస్ నుంచి వస్తున్న ఆ నది మీదుగా రష్యా తన బలగాలను ఉక్రెయిన్కు తరలిస్తోంది. నిజానికి చెర్నోబిల్ లో ప్రస్తుతం ఎవరూ లేరు. కానీ అక్కడ ఏదైనా ఫైటింగ్ జరిగితే, అప్పుడు ఆ ప్రాంతంలో మళ్లీ అణుధార్మిక పదార్ధాలు ఉత్పాతం కలిగించే అవకాశాలు ఉన్నాయి. చెర్నోబిల్ను సొంతం చేసుకోవడం పుతిన్ విక్టరీగా భావించినా.. రేడియోయాక్టివ్ పదార్ధాలతో ఏ ప్రమాదం పొంచి ఉందే ఊహించలేం.