ఇబ్రహీంపట్నం, నవంబర్ 26 : పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం దానిని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు డీఎస్ఆర్ యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ద్వారా గ్రామాల్లో జరుగుతున్న ప్రతిపనినీ ఆన్లైన్లో పొందుపర్చుతుండటంతో సత్ఫలితాలిస్తున్నాయి. పల్లె ప్రగతిలో పంచాయతీ కార్యదర్శులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాభివృద్ధి పనులు జరిగేలా పంచాయతీరాజ్శాఖ గతంలోనే డైలీ శానిటైజేషన్ రిపోర్టు (డీఎస్ఆర్)యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులు ఈ యాప్లో పనులను నమోదు చేస్తుండటంతో పారదర్శకత, జవాబుదారితనం పెరిగింది. ఈ విధానం ద్వారా జిల్లా వ్యాప్తంగా 558గ్రామపంచాయతీల్లో పారిశుధ్యం, అభివృద్ధి, పచ్చదనం, పల్లె ప్రకృతివనాలు, కంపోస్టుయార్డులు, పంచాయతీపాలన, రికార్డులు, ధ్రువీకరణ పత్రాలు, మరణాల నమోదు, విద్యుత్ బిల్లులు, గ్రామపంచాయతీ సమావేశాలు వంటి పనులను ఎప్పటికప్పుడు ఈ యాప్లో పొందుపర్చుతున్నారు.
ప్రజలకు అందుబాటులో కార్యదర్శులు..
పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీఎస్ఆర్యాప్ ఎంతో ఉపయోగపడుతున్నది. జిల్లాలోని 558 గ్రామపంచాయతీలకు కచ్చితంగా కార్యదర్శులు అందుబాటులో ఉంటున్నారు. యాప్ లొకేషన్లో ఉంటూ గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలను ఆన్లైన్లో పొందుపర్చుతున్నారు. ఉదయం 8గంటల నుంచి ఈ యాప్కార్యదర్శులకు అందుబాటులో ఉంటుంది. కార్యదర్శి ఉదయం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఫొటోలు తీసి ఈ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ రోజు కార్యదర్శి విధుల్లో లేనట్లుగానే పరిగణిస్తారు. ఇలా ప్రతిరోజూ ఈ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉదయమే పంచాయతీ కార్యదర్శి గ్రామపంచాయతీకి చేరుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా పారిశుధ్య సిబ్బంది కూడా అందుబాటులో ఉండి గ్రామాలను శుభ్రంచేస్తారు. అలాగే, తాగునీటి సరఫరా కూడా వీరి పర్యవేక్షణలో కొనసాగుతుంది.
కార్యదర్శులు చేయాల్సిన పనులు..
గ్రామ కార్యదర్శులు ఉదయం 8గంటలకు కార్యాలయానికి చేరుకుని డీఎస్ఆర్ యాప్ను ఆన్చేయాల్సి ఉంటుంది. పంచాయతీ కార్యాలయం వద్దకు సమయానికి వెళ్లే ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పారిశుధ్య సిబ్బంది రోడ్లను శుభ్రంచేయడంతో పాటు గ్రామాల్లో ప్రతిరోజూ చేపట్టే పనులకు సంబంధించిన ఫొటోలను యాప్లో అప్లోడ్ చేయాలి. పాత తేదీల్లో తీసిన ఫొటోలైతే అప్లోడ్ అవ్వవు.
పంచాయతీ ట్రాక్టర్కు జీపీఎస్..
పల్లెలు పరిశుభ్రంగా ఉండాలని, మొక్కలు ఏపుగా పెరిగి పల్లెలు ఆహ్లాదకరంగా కనిపించాలని సీఎం కేసీఆర్ కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసి, ప్రతి గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్రాలీని అందించారు. ఈ ట్రాక్టర్ గ్రామపంచాయతీ పరిధిలోనుంచి బయటకు వెళ్లకుండా అధికారులు జీపీఎస్ను ఏర్పాటు చేశారు. దీనిద్వారా ట్రాక్టర్ గ్రామపంచాయతీ పరిధిలో నుంచి వెళ్లిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం వెళ్తుంది. ఈ ట్రాక్టర్ కేవలం గ్రామంలోనే చెత్తసేకరణ, మొక్కలకు నీటిని అందించడం వంటి పనులు మాత్రమే చేయాల్సి ఉంటుంది.
డీఎస్ఆర్ యాప్ సత్ఫలితాలిస్తున్నది
డీఎస్ఆర్ యాప్ విధానం జిల్లాలో సత్ఫలితాలిస్తున్నది. గ్రామ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు గ్రామంలో జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా ఆన్లైన్లో పొందుపర్చుతున్నారు. దీంతో గ్రామాల్లో జరుగుతున్న పనులు అధికారులకు వెంటనే తెలియడంతో పాటు ప్రభుత్వానికి అధికారులు జవాబుదారిగా నిలుస్తున్నారు.
ప్రతిరోజూ ఉదయం 9గంటల లోపు గ్రామపంచాయతీకి చేరుకుంటున్నాం. గ్రామపంచాయతీకి వెళ్లగానే మొదటగా హాజరుకు సంబంధించిన ఫొటోను యాప్లో అప్లోడ్ చేస్తున్నాం. అనంతరం గ్రామంలో చేపట్టే పారిశుధ్యం, హరితహారం మొక్కలకు నీటిని అందించే ఫొటోలు అప్లోడ్ చేయడం ఉంటుంది.