న్యూఢిల్లీ/రంగారెడ్డి, మార్చి 23 (నమస్తే తెలంగాణ): వరుసగా రెండో రోజూ పెట్రో ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 88 పైసలు పెరిగింది. పెంచిన ధరలతో హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.110.01కి చేరగా, లీటరు డీజిల్ ధర రూ.96.37కు పెరిగింది. ఐదు రాష్ర్టాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు నాలుగున్నర నెలలు ఇంధన ధరల జోలికి పోని కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు ముగియడంతో మళ్లీ ధరలను ఎడాపెడా పెంచుతున్నది.
పెట్రో ధరల పెంపు ఇలాగే కొనసాగుతుందని, భవిష్యత్తులో ఇంధన ధరలు మరింతగా పెరుగుతాయని ‘సీఎన్బీసీ-టీవీ18’ నివేదిక వెల్లడించింది. చిన్న మొత్తాల్లో ఈ ధరల పెంపు కొనసాగవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుతానికి ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే నిర్ణయం ఏమీ ఉండకపోవచ్చని అంచనావేసింది.
ఇంధన ధరల పెంపును నిరసిస్తూ విపక్షాలు చేపట్టిన నిరసనలతో బుధవారం పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. టీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్, వామపక్షాల సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఉభయసభలు పలుమార్లు వాయిదాపడ్డాయి.
‘ప్రతీనెలా ఎన్నికలు జరుగాలి. అలా అయితేనే.. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెంపునకు అడ్డుకట్ట పడుతుంది. ఇంధన ధరల పెంపును కేవలం ఎన్నికలు మాత్రమే అడ్డుకోగలవు’
-బుధవారం లోక్సభలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే
నగరం పెట్రోల్ డీజిల్
హైదరాబాద్ 110.01 96.37
ఢిల్లీ 97.01 88.27
ముంబై 111.67 95.85
కోల్కతా 106.34 91.42
చెన్నై 102.91 92.95