మహబూబ్నగర్, డిసెంబర్ 5 : ఐకమత్యంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవీ విద్యార్థి వసతి గృహం (వైశ్య హాస్టల్) కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైశ్య హాస్టల్లో ఎందరో విద్యార్థులు చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. వసతులను సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చక్రధర్గుప్తా, ఎదిర ప్రమోద్కుమార్, కల్వశంకర్ను సన్మానించారు. తర్వాత మంత్రి శ్రీనివాస్గౌడ్కు మెమోంటో అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో కండె శ్రీను, రాజ నరసింహ, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పాలాది రామ్మోహన్, సంఘం అధ్యక్షుడు గుండ వెంకటేశ్, మురళి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రథయాత్రకు స్వాగతం
జడ్చర్ల టౌన్, డిసెంబర్ 5 : భగవద్గీత ‘జీవన గీత-ప్రేరణ గీత’ నినాదంతో చేపడుతున్న లక్ష యువగళ గీతార్చన ప్రచార రథయాత్రను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 14న హైదరాబాద్లో లక్ష మంది యువతీ యువకుల సాముహిక గీతా పారాయణం కార్యక్రమా న్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా చేపడుతున్న ప్రచార రథం ఆదివారం జడ్చర్లకు చేరగా.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, వీహెచ్పీ జిల్లా నాయకులు జగపాల్రెడ్డి, మిర్యాల యాదయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కులమతాలకతీతంగా పాలన
మహబూబ్నగర్, డిసెంబర్ 5 : రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా పాలన కొనసాగుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి ప్రాంగణంలో యునైటెడ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవులతో కలిసి మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా పరిష్కరించి జనరంజక పాలన అందిస్తున్నట్లు తెలిపారు. పాలమూరు పట్టణంలో తాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించామని చెప్పారు. అనంతరం కొవ్వొత్తులతో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్కు పాస్లర్లు కేక్కట్ చేసి తినిపించారు. క్రైస్తవులు హాజరయ్యారు. కార్యక్రమంలో రెవరెండ్ వరప్రసాద్, పాస్టర్లు పాల్గొన్నారు.