శ్రీరామ్, ఎల్సా, శుభశ్రీ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘రుద్రవీణ’. మధుసూదన్ రెడ్డి దర్శకుడు. రాగుల లక్ష్మణ్, శ్రీను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర ప్రీలుక్ లాంచ్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్లో జరిగింది. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా ముఖ్యఅతిథులుగా ప్రీలుక్ పోస్టర్ను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రతీకార కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. యాక్షన్ ప్రధానంగా సాగుతుంది. కథానుగుణంగా చక్కటి సంగీతం కుదిరింది’ అన్నారు. ఈ సినిమాలో తాను విలన్గా నటించానని రఘు కుంచె తెలిపారు. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత లక్ష్మణ్ పేర్కొన్నారు.