మాస్కో/టోక్యో, ఫిబ్రవరి 28: ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు ప్రతీకారంగా అమెరికాసహా దాని మిత్రదేశాలు, ఐరోపా అగ్రదేశాలు తీసుకుంటున్న ఆర్థికపరమైన ఆంక్షలు ప్రభావం చూపుతున్నాయి. సోమవారం రష్యా కరెన్సీ రూబుల్ విలువ దాదాపు 30 శాతం పతనమైంది. డాలర్తో పోల్చితే రికార్డు స్థాయిలో 114.33 డాలర్లకు దిగజారింది. గ్లోబల్ బ్యాంక్ పేమెంట్స్ సిస్టమ్ నుంచి రష్యాను తప్పించడమే ఇందుకు కారణం. అమెరికా, జపాన్, పశ్చిమాది దేశాలు.. స్విఫ్ట్ గ్లోబల్ బ్యాంక్ పేమెంట్స్ సిస్టమ్తో కొన్ని రష్యా బ్యాంకులకున్న అనుమతిపై నిషేధం విధించాయి. దీంతో అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో రూబుల్ విలువ ఒక్కసారిగా భారీ కుదుపునకు లోనైంది.
ఉక్రెయిన్కు మద్దతుగా రష్యాకు వ్యతిరేకంగా ఆయా దేశాలు విధిస్తున్న ఆంక్షలు రష్యన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇప్పటికే కరోనా పరిస్థితులు, ఇతరత్రా ఇబ్బందులతో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ.. ఈ యుద్ధంతో మరింత ప్రమాదంలో పడిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ఎగుమతులు పడిపోతాయని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న విదేశీ మారకపు నిల్వలూ ప్రభావితమవుతాయని చెప్తున్నారు.
రష్యా సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను భారీగా పెంచేసింది. కరెన్సీ మార్కెట్లో క్షీణిస్తున్న రూబుల్కు మద్దతుగా కీలక వడ్డీరేటును 9.5 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో బ్యాంకుల రక్షణార్థం కూడా ఈ చర్యకు దిగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక వ్యవస్థలోకి మరింత ద్రవ్యాన్ని పంపించి బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా సెంట్రల్ బ్యాంక్ పలు నిర్ణయాలు తీసుకుంటున్నది.