హైదరాబాద్/ సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): అన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు బుధవారం నుంచి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించనున్నట్టు ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రయాణికులు రిపోర్టు వచ్చే వరకు విమానాశ్రయంలోనే ఉండాలని స్పష్టంచేశారు. కరోనా పాజిటివ్ వచ్చినవారిని గచ్చిబౌలిలోని టిమ్స్ దవాఖానకు తరలించి, చికిత్స అందిస్తామని చెప్పారు. టిమ్స్లో రెండు అంతస్తుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేశామని వివరించారు. మంగళవారం ఆయన కోఠిలో మీడియాతో మాట్లాడుతూ.. ఒమిక్రాన్ ప్రభావిత రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన 41 మందికి టెస్టు చేయగా, నెగెటివ్ వచ్చిందని చెప్పారు.
వారిని హోం ఐసోలేషన్లో ఉంచి, మానిటరింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. మనదేశంలో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ వేరియంట్ కేసు కూడా నమోదు కాలేదని, ఈ విషయంలో సోషల్ మీడియా వార్తలు నమ్మొద్దని సూచించారు. కొత్త వేరియంట్ విషయంలో అప్రమత్తంగాఉండాలని, నిర్లక్ష్యంగా ఉంటే మరో ముప్పును చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. వ్యాక్సిన్ తీసుకోని వారిపై కొత్త వేరియంట్ ప్రభావం ఎకువగా ఉన్నట్టు విదేశాల్లో వెల్లడైందని చెప్పారు. కొత్త వేరియంట్ను గుర్తించేందుకు అన్ని దవాఖానల్లో టెస్టులు చేస్తున్నట్టు తెలిపారు. కరోనా నూతన వేరియంట్ కారణంగా ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు ఉంటాయని వివరించారు. వైరస్ను నియంత్రించే విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నదని చెప్పారు. మాస్క్ మన జేబులో ఉన్న వ్యాక్సిన్ అని, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.