(స్పెషల్ టాస్క్ బ్యూరో)
BJP Vs RSS | హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీకి.. ఆ పార్టీకి సైద్ధాంతిక గురువుగా భావించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) నేతలు గట్టి షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం శివరాజ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని పేర్కొంటూ.. కొంత మంది ఆరెస్సెస్ నేతలు ఏకంగా కొత్త పార్టీ స్థాపించారు. ఆరెస్సెస్ ప్రచారక్ హోదాలో పనిచేసిన ముగ్గురు సీనియర్ నేతలు అభయ్ జైన్, మనీష్ కాలే, విశాల్ బాదల్ ఆదివారం ఇండోర్లో వందలాది మంది సంఘ్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ‘జనహిత’ పేరుతో పార్టీని ప్రకటించడం సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ పాలనకు వ్యతిరేకంగా అరెస్సెస్ నేతలు కొత్త పార్టీని స్థాపించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. బీజేపీ పాలనపై సంఘ్ నేతల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు దీని ద్వారా తెలుస్తున్నది.
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ వ్యతిరేకత ఉన్నదని, బీజేపీ సర్కార్ విఫలమైందని అభయ్ జైన్, మనీష్ కాలే, విశాల్ బాదల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై 5 లక్షల మందితో సంతకాలు సేకరించి మెమోరాండం సమర్పించినా సీఎం చౌహాన్ స్పందించలేదని విమర్శించారు. ప్రజల్లో వ్యతరేకతను తగ్గించుకొనేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పనితీరు మార్చుకోవాలని తాము ఎన్నిసార్లు సూచించినా వినిపించుకోలేదని తెలిపారు. దీంతో శివరాజ్ సర్కార్కు బుద్ధి చెప్పేందుకు కొత్త పార్టీ స్థాపించామని వివరించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనహిత పార్టీ రాష్ట్రంలోని 230 అసెంబ్లీ సీట్లలో పోటీచేస్తుందని అభయ్ జైన్ వెల్లడించారు. బీజేపీని ఓడించే లక్ష్యంతో అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతుందని స్పష్టం చేశారు. తమ పార్టీ వల్ల బీజేపీ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చే ప్రమాదం ఉందన్నారు. హిందూత్వ భావజాలం ఉండి, బీజేపీ ప్రభుత్వ పాలన పట్ల వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు తమ వైపు మళ్లుతారని పేర్కొన్నారు. సమావేశానికి రెండు వందల మంది హాజరుకాగా.. అందులో తమకు సంఘీభావంగా కొందరు ఇతర రాష్ర్టాల నుంచి కూడా వచ్చారని తెలిపారు. తమ పార్టీ ప్రధాన లక్ష్యం సుపరిపాలన, విద్య, ఆరోగ్య సంరక్షణ, శాంతిభద్రతలు, వేగవంతమైన న్యాయ వ్యవస్థ అని అభయ్ జైన్ తెలిపారు.